కమలాపూర్ : బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది టీఆర్ఎస్సేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గూడూరు గ్రామ శివారులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తే ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి సభ పెట్టకుండా చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడమే బీజేపీ నాయకుల లక్ష్యమన్నారు.
సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం పెడితే ప్రారంభం నుంచి దుష్ప్రచారం చేశారన్నారు. జూరాబాద్లో లబ్ధిదారుల యూనిట్లు గ్రౌండింగ్ అవుతుండడంతో ఎలాగైనా పథకాన్ని ఆపాలని ఎన్నికల కమిషన్కు ప్రేమేందర్రెడ్డి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఈటల ఆత్మగౌరవం పేరుతో మొసలికన్నీళ్లు కారుస్తూ పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నాడని ఆరోపించారు.
ప్రజల సానుభూతి కోసం దెబ్బతగిలినట్టు, ఆరోగ్యం దెబ్బతిన్నట్టు కట్టు కట్టుకుని ప్రచారం చేసి నాల్గు ఓట్లు సంపాదించే కుట్రలు చేసిండని మండిపడ్డారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారన్నారు.