ముంబై: నటుడు, బిగ్బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ( Sidharth Shukla ) మృతదేహానికి శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. దీనికోసం ప్రత్యేకంగా ముగ్గురు డాక్టర్లను నియమించారు. అయితే సిద్ధార్థ్ ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఈ రిపోర్ట్ స్పష్టం చేసినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అతని అంతర్గత అవయవాలను విశ్లేషిస్తే.. మృతికి కారణమేంటన్నది తెలుస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వీటి నమూనాలను విశ్లేషణ కోసం పంపించారు.
హిస్టోపాథాలజీ జరిపిన తర్వాతే మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. 40 ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా.. గురువారం మరణించిన విషయం తెలిసిందే. తెల్లవారుఝామున గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో అతన్ని కూపర్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. మరోవైపు సిద్ధార్థ్ అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్నాయి.