హైదరాబాద్, జనవరి 31 : కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోయినప్పటికీ సొంత కాళ్లపై ఎదుగుతున్న తెలంగాణను అభినందించకుండా నరేంద్రమోదీ సర్కారు ఇంకా అదే వివక్షను కొనసాగిస్తున్నది. సోమవారం విడుదలైన జాతీయ ఆర్థిక సర్వే, పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని మెట్రోరైలు ప్రాజెక్టుల గురించి వివరించిన ఈ సర్వే.. హైదరాబాద్ మెట్రోరైలు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇతర నగరాల్లోని మెట్రోరైళ్ల రూట్ మ్యాప్లు, ప్రయాణికుల లెక్కలు, వచ్చిన వసూళ్లు, కొవిడ్ ప్రభావం లాంటి వివరాలను ఈ సర్వేలో విపులంగా పేర్కొన్నారు. ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలోని మెట్రోరైలు మార్గాలు గత పడేండ్లలో ఎలా మార్పు చెందాయన్న విషయాన్ని ఫొటోలతో సహా సోదాహరణంగా వివరించారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన హైదరాబాద్ మెట్రోరైలును మాత్రం పూర్తిగా విస్మరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి అందజేస్తూనే ఉన్నది. ఈ వివరాలు పబ్లిక్ డొమైన్లోనూ అందుబాటులో ఉన్నాయి. అయినా కేంద్రం ఉద్దేశపూర్వకంగానే హైదరాబాద్ను విస్మరించిందని నిపుణులు మండిపడుతున్నారు.
కేంద్రానికి ఆదర్శంగా నిలిచినా..
రాష్ట్రంలోని ‘మిషన్ భగీరథ’ను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రం చేపట్టిన ‘హర్ ఘర్ జల్’ గురించి రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 6 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించినట్టు ఘనంగా చెప్పుకొన్నారు. కానీ.. హర్ ఘర్ జల్కు ప్రేరణగా నిలిచిన మన ‘మిషన్ భగీరథ’ గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ‘హర్ ఘర్ జల్’ కు తెలంగాణలోని మిషన్ భగీరథే ఆదర్శమని ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ర్టాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే ఇంటింటికీ నీరు అందుతున్నదని ఆర్థిక సర్వేలో పేర్కొన్నది. తెలంగాణ, గోవా, హర్యానాలో మాత్రమే 100 శాతం ఇండ్లకు నల్లానీరు అందుతున్నట్టు వెల్లడించింది. కనీసం ఈ అంశాన్నైనా రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చకపోవడం తెలంగాణ పట్ల కేంద్రం కొనసాగిస్తున్న వివక్షకు నిలువెత్తు నిదర్శనమని నిపుణులు ఆక్షేపిస్తున్నారు.