ముప్కాల్, ఏప్రిల్ 29: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు ముస్లిం మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అడ్డుకున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో సోమవారం రాత్రి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలో ఉన్న మసీదు నుంచి నమాజ్ మొదలు కాగానే.. ఇది మనకు అవసరమా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నమాజ్ పూర్తయ్యాక అర్వింద్ మాట్లాడుతూ పూజ చేసుకుంటే దేశమంతా వినిపించాలా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి మసీదుల్లో ఉన్న 35 వేల స్పీకర్ల సౌండ్ను తగ్గించారని, పర్మిషన్ లేని 11 వేల స్పీకర్లను కట్ చేయించారన్నారు. హిందువులకు కావాల్సిన చట్టాలు రావాలంటే మరోసారి నరేంద్ర మోదీ రావాలని, 400 సీట్లలో గెలిపించాలని కోరారు. అప్పటికే అర్వింద్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రచారం జరగడంతో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అడ్డుకున్నారు. ఎవరి దేవుడ్ని వారు పూజిస్తారని, ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మీకు మా ఓట్లు అవసరమా? అని ప్రశ్నించారు. ‘ఇష్టం ఉంటే వేయండి లేకుంటే వద్దు. జై శ్రీరాం’ అనుకుంటూ అర్వింద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత నొచ్చుకున్న ముస్లిం మహిళలు అక్కడున్న బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు.