ఎన్నో పోరాటాల ఫలితంగా దేశంలోని కార్మికులు సాధించుకున్న చట్టాలను, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. శ్రామికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని కార్మికులు అంటున్నారు. దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. కష్టజీవుల వెతలు తెలిసిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తేనే కార్మికుల హక్కులకు రక్షణ ఉంటుందని, శ్రమ జీవుల బతుకులు బాగు పడతాయని ముక్తకంఠంతో చెబుతున్నారు.
బోధన్/కమ్మర్పల్లి/ఖలీల్వాడి, సెప్టెంబర్ 23:దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్న వేళ సర్వజన సమానత్వాన్ని నిజాయితీగా కోరుకునే నాయకుడు కావాలని కామన్ మ్యాన్ ఆక్షాంక్షిస్తున్నాడు. సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్ర ప్రగతి.. తమ ప్రగతికి దోహదం చేస్తుందని నమ్ముతున్న ప్రజలు.. అలాంటి పరిపాలన అందించే నాయకుడు దేశానికి ఇప్పుడు అత్యవసరమని భావిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆరే ఇందుకు సరైన నాయకుడిగా సకలవర్గాల వారు కోరుకుంటున్నారు.
పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు దేశ అభివృద్ధి, ఉపాధి రంగంలో కార్మికుల బతుకుకు భరోసానిస్తాయి. వాటిని కాపాడుకోవడం, అభివృద్ధి బా ట పట్టించడం, ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు దేశానికి వచ్చేలా చేయడం కార్మిక సంక్షేమానికి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. కానీ నేడు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంతోపాటు నిర్వీర్యం చేసే స్వార్థ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇదే తరుణంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో కొత్త పరిశ్రమల రాక ఉత్సాహంగా సాగుతున్నది. ఇది ఉపాధి, కార్మిక వ్యవస్థకు మేలు చేస్తుంది. దీంతో కేసీఆర్లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశానికి మేలు జరుగుతుందనే నమ్మకం సర్వత్రా నెలకొన్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లాలి.. దేశానికి నాయకత్వం వహించాలి..తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అందాలని కోరుకుంటున్నారు.
కార్మిక పక్షపాతి కేసీఆర్
కేసీఆర్ కార్మికుల పక్షపాతి. రైతులు, కార్మికులు లేకుండా ఈ భారతదేశం లేదు. ఈ రెండు వర్గాలంటే కేసీఆర్కు ఎంతో ప్రేమ. రైతులతోపాటు మా కార్మికుల ప్రయోజనాలు దేశవ్యాప్తంగా నెరవేరాలంటే కేసీఆర్ దేశ ప్రధాని కావాలి. ఈ దేశాన్ని పాలించే దక్షత, సత్తా కేసీఆర్కే ఉంది. తెలంగాణ పోరాటాన్ని నడిపించిన యోధుడు కేసీఆర్ సార్.. అలాంటి యోధుడు దేశానికి నాయకత్వం వహిస్తే ఈ దేశం అనేక రంగాల్లో ముందుంటుంది. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి కార్మికుల కష్టాలు పట్టడం లేదు.
వివిధ రాష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీలను ప్రైవేట్పరం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం బలవంతం చేస్తున్నది. ఇందుకు సాక్ష్యం 2019లో కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా చట్టానికి తీసుకువచ్చిన సవరణలే. ఈ సవరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టును ప్రైవేట్పరం చేసుకోవచ్చు. కొన్ని రాష్ర్టాల్లో ఆర్టీసీ ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో ఆర్టీసీకి ఎంత నష్టమొచ్చినా ప్రయాణికులు, కార్మికుల మేలు కోసం ప్రైవేటీకరణ చేయలేదు. రెండేండ్లు గా నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చా రు. ఇది కేసీఆర్కు ప్రజలు, కార్మికుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. అందుకే కేసీఆర్ దేశ్ కీ నేత కావాలని కార్మికులందరం కోరుకుంటున్నాం.
దేశమంతటా అభివృద్ధి..
తెలంగాణను సాధించడమే కాదు.. బంగారు తెలంగాణాగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్తోనే దేశంలో మార్పు వస్తుంది. కార్మికులు, అట్టడుగు వర్గాల సంక్షేమం దేశవ్యాప్తంగా జరగాలంటే.. అది కేసీఆర్తోనే సాధ్యం. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవు. ఈ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలవ్వాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. పేదల కష్టాలు తెలిసినోడు దేశ ప్రధాని అయితే.. దేశం సుభిక్షంగా ఉంటుంది.
-మచ్కూరి శ్రీనివాస్,నిజాం షుగర్స్ కార్మిక నాయకుడు, శక్కర్నగర్
సమస్యలు పరిష్కారమవుతాయి
కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నది. నల్లచట్టాలను తీసుకువచ్చి కార్మికుల ప్రయోజనాలను కాలరాస్తున్నది. అంబానీ, ఆదానీలకు దేశాన్ని దోచిపెట్టేందుకే ఇదంతా జరుగుతున్నది. కార్మికుల పొట్ట కొడుతున్న కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి క్రియాశీలక పాత్ర పోషించాలి. దేశంలో కార్మిక సంక్షేమం కేసీఆర్తోనే సాధ్యం. గతంలో కేసీఆర్ కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనితీరును దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు, నాయకులు చూశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం అనేక అడ్డంకులు, ఆటంకాలు కల్పించినప్పటికీ కేసీఆర్ తన పరిధిలో కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషిచేశారు. దోపిడీకి గురవుతున్న కార్మికుల సంక్షేమం కోసం పరిమితులను దాటుకుంటూ చర్యలు తీసుకున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కేసీఆర్తోనే సాధ్యమవుతాయి. అందుకే కేసీఆర్ దేశ్ కీ నేత కావాలంటూ మద్దతు ఇస్తున్నాం.
– నాగుల రవిశంకర్గౌడ్,నిజాంషుగర్స్ మజ్దూర్ సభ నాయకుడు, బోధన్
మతతత్వాన్ని ఓడించడానికి అంతా ఐక్యం కావాలి..
సీఎం కేసీఆర్ తెలంగాణ నుంచి దేశ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. దేశంలో మతతత్వ శక్తులను ఒంటరి చేసి లౌకికవాదాన్ని పెంపొందించడం కోసం, దేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు అందరూ ఐక్యం కావాలి. కేసీఆర్లాంటి వారు జాతీయ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది.
– మల్యాల గోవర్ధన్,జిల్లా ఉపాధ్యక్షుడు, సీఐటీయూ, నిజామాబాద్
దేశాన్ని పాలించగల సమర్థుడు..
వివక్ష చూపిన పాలకుల నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినట్లు.. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సమర్థత కేసీఆర్కు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో దేశంలోని సామాన్య పౌరులపై మోయలేని ఆర్థిక భారం పడుతున్నది. ఈ పరిస్థితిని నివారించడంలో దేశ పాలకులు విఫలమయ్యారు. ఇలాంటి నాయకులకు ప్రత్యామ్నాయ శక్తి కేసీఆర్. అందుకే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.
-రమేశ్, ఆటో యూనియన్ మండల నాయకుడు, మెండోరా మండలం
కార్మికులను ఆదుకున్న మహనీయుడు..
రాష్ట్రంలోని కార్మికులకు అన్నివిధాలా వసతులు కల్పించిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం మంచిదే. దేశంలో చాలా మంది కార్మికులు ఉన్నారు. అన్ని రాష్ర్టాల వారికి సముచిత న్యాయం దక్కుతుంది. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తే కార్మికులకు భరోసా ఉంటుంది.
– కల్లెడ గంగన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం, అధ్యక్షుడు, నిజామాబాద్
కార్మికులకు అండగా నిలవాలి..
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం సంతోషకరం. కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ నుంచి ఎవరు దేశ రాజకీయాల్లోకి వెళ్లినా స్వాగతించాలి. ఐక్యంగా ఉండి పోరాడితేనే మతతత్వాన్ని ఓడించగలం. దేశ ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు ఐక్యంగా ముందుకు సాగాలి.
– రమేశ్బాబు, జిల్లా కార్యదర్శి, సీపీఐ
కేసీఆర్ సేవలు దేశానికి అందాలి
కేసీఆర్ సార్ ఎనిమిదేండ్ల పాలనలో సాధారణ ప్రజలకు ఎన్నో మంచి పథకాలు, కార్యక్రమాలు అందించారు. పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా అందిస్తున్నారు. కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడో గుర్తించి దానిని అందించాలనే ఆలోచన గల నాయకుడు కేసీఆర్. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తే దేశంలోని కామన్ మ్యాన్కి మేలు చేకూరుతుంది.
-వసీం అన్సారీ, ఆర్మూర్, ఆటో కార్మిక యూనియన్ అధ్యక్షుడు,బాల్కొండ
కార్మిక సంక్షేమ నిర్ణయాలు సాధ్యం..
దేశంలో కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ఆలోచనా విధానాలు ఎంతో అవసరం. దేశంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ఇప్పటికే కేసీఆర్ ప్రతిఘటిస్తున్నారు. కార్మికులకు, ఉపాధి రంగానికి నష్టం కలిగించే చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. అందుకే కేసీఆర్లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో ఉంటే దేశానికి, కార్మిక రంగానికి సానుకూల పరిణామాలు సాధ్యమవుతాయి.
-ఎ.వి. శ్రీనివాస్ రావు, రీజినల్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం, పోచంపాడ్,
మెండోరా మండలం
సంక్షేమానికి పెద్దపీట వేశారు..
తెలంగాణలో కేసీఆర్ అందిస్తున్న పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నో రాష్ర్టాల వారు, దేశంలోని ఇతర పార్టీల వారు సైతం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి అభినందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది.
-రియాజ్, ట్యాక్సీ డ్రైవర్, బాల్కొండ
తిరుగులేని నాయకుడు ..
దేశంలో సీఎం కేసీఆర్కు తిరుగులేదు. తెలంగాణలో కార్మికుల గురించి పట్టించుకున్న ఏకైక సీఎం కేసీఆర్. అన్నిరంగాల వారికి సముచిత న్యాయం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం కేసీఆరే. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మిగతా రాష్ర్టాల వారు ఆరా తీస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కార్మికులంతా కోరుకుంటున్నారు.
– విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి, టీఆర్ఎస్ కార్మిక విభాగం