వడ్లు కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పడంతో రాష్ట్రప్రభుత్వం ‘ప్రత్యామ్నాయ’ పంటలపై దృష్టిపెట్టింది. మార్కెట్ డిమాండ్కు తగిన పంటలు సాగు చేసేదిశగా రైతుల్ని ప్రోత్సహిస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపట్టిన జలవికాస కార్యక్రమాలతో పుష్కల సాగునీటివసతి రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఉచిత కరెంటు, పెట్టుబడిసాయం అందుతున్నది. రైతు సంక్షేమ పథకాలు భరోసాను నింపాయి. సాగు కష్టాలు తీరడంతో కొద్దికాలంగా రైతులందరూ ఒకేరకమైన పంటలను సాగు చేస్తున్నారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నప్పటికీ, ధాన్యం సేకరణకు కేంద్రప్రభుత్వం కొర్రీలు విధిస్తున్నది. దీంతో అత్యవసరంగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే అవసరం ఉమ్మడిజిల్లా రైతులకు ఏర్పడింది. వరికి బదులుగా జొన్న, పెసర, మినుము, కంది, సోయాబీన్, పత్తి, చెరుకు, కూరగాయలు సాగు చేసేలా కర్షకులను వ్యవసాయశాఖ సన్నద్ధం చేస్తున్నది.
నిజామాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వ్యవసాయ సాగు విప్లవం నడుస్తున్నది. సీఎం కేసీఆర్ దార్శనికతతో గడిచిన ఏడేండ్లలో దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా రైతు సంక్షేమ పథకాలు ఆచరణలోకి వచ్చాయి. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు దేశ వ్యాప్త ప్రశంసలు దక్కాయి. సాగు నీళ్లు సమృద్ధిగా అందిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విస్తీర్ణం గతంతో పోలిస్తే పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ బీడు భూములే లేకుండా పంటలు సాగవుతున్నాయి. మిషన్ కాకతీయ, కాలువల తవ్వకం, ఉచిత కరెంట్ ఇలా కారణాలేమైనప్పటికీ కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో సాగు సంబురం దరి చేరింది. అయితే… సాగు కష్టాలు తీరడంతో కొద్ది కాలంగా రైతులు అంతా ఒకే రకమైన పంటలను సాగు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఒకే పంట ఉత్పత్తులు రావడంతో డిమాండ్ పడిపోయి ధర అంతగా లభించడం లేదు. వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నప్పటికీ కేంద్రం విధిస్తున్న కొర్రీల మూలంగా సేకరించిన ధాన్యం పురుగుల పాలవుతోంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే అవసరం ఇప్పుడు ఉమ్మడి జిల్లా రైతన్నలకు ఏర్పడింది. ఇందులో భాగంగా వరికి బదులుగా జొన్నలు, పెసర్లు, మినుములు, కందులు, సోయాబీన్, పత్తి, చెరుకు, కూరగాయల సాగు చేసేలా కర్షకులను వ్యవసాయ శాఖ సన్నద్ధం చేస్తున్నది.
ఆరుతడికి అనువైన నేలలు…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో 70శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉండగా వీరు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా ప్రజల అవసరాలకు లక్ష టన్నుల కూరగాయలు కావాల్సి ఉండగా కేవలం సగం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతుండగా మిగిలినవి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూరగాయలతోపాటు మార్కెట్లో డిమాండ్ ఉండే అల్లం, ఉల్లి, వెల్లుల్లి, ధనియాలు, మిరప వంటి పంటలను కూడా కొద్ది పాటి విస్తీర్ణంలో సాగు చేసుకుంటే రైతులందరికీ ప్రయోజనాలు చేకూరే అవకాశాలుంటాయి. ఎక్కువ సాగు భూమి ఉన్న వారు ఇప్పటికే మామిడి తోటలతో లాభాలు పొందుతున్నారు. అరటి, బొ ప్పాయి వంటి ప్రత్యామ్నాయ తోట పంటలుగా మార్చుకున్నారు. ఈ రెండు పంటలకు మార్కెట్ అవకాశాలు కూ డా సమృద్ధిగానే ఉండగా జిల్లాలో వీటి సాగు ఏటికేడు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆరుతడి పంటలు వేయలేని కొద్దిశాతం నేలల్లో వరిని పండించినప్పుడు మాత్రం తప్పనిసరిగా సన్నరకాలను పండించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అనువైన నేలల్లో నీటి లభ్యత మేరకు యాసంగిలో మక్క, ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, శనగ, పెసర, మినుము, సోయాబీన్, జొన్న సాగు చేయ వచ్చు. అన్ని రకాల్లోనూ సాగులో యంత్రాల సాయాన్ని తీసుకునే వీలుంది. వరి, మక్క, నువ్వు లు, జొన్న, సజ్జ తదితర పంటల్లో బై బ్యాక్ పద్ధతిన విత్తనోత్పత్తిని చేపట్టే అవకాశాలున్నాయి.
వెన్నుదన్నుగా వ్యవసాయ శాఖ..
యాసంగిలో నూతన పంటల సాగుకు వ్యవసాయ శాఖ ఎల్లప్పుడూ రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నీటి లభ్యత, భూమి అనుకూతలను అనుసరించి ఆయా పంటలను వ్యవసాయ శాఖ ఏఈవోలు రైతులకు సూచనలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 106 క్లస్టర్లు, కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణాధికారులు వరి పంటలకు బదులుగా ఇతరత్రా పంటలు సాగు అయ్యేలా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నిజామాబాద్లో 2021 వానకాలంలో 5లక్షల 7వేల 800 ఎకరాల్లో పంటలు వేశారు. యాసంగిలో మరింతగా సాగు విస్తీర్ణం అధికమయ్యే వీలుంది. నీళ్లు పుష్కలంగా ఉండడంతో రైతులంతా బీడు భూములను ధైర్యంగా సాగులోకి తీసుకువస్తున్నారు. కామారెడ్డిలో 4లక్షల 98వేల 193 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇదీ రికార్డు కాగా… ఈ యాసంగిలో దాదాపుగా 5లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులను వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది.
పత్తికి డిమాండే ఉదాహరణ..
జల వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రైతులంతా వరి పంటలు సాగు చేస్తున్నారు. కానీ కొంత మంది ఆదర్శవంతమైన సేద్యం చేస్తున్న వారు గడిచిన వానకాలంలో పత్తి పంటను సాహసోపేతంగా సాగు చేసి ఇప్పుడు దూదిపూలతో పండుగ చేసుకుంటున్నారు. 2021-22లో పత్తి క్వింటాలుకు రూ.5726గా నిర్ణయించారు. మార్కెట్లో పత్తికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ పెరిగింది. దీంతో పత్తి క్వింటాకు రూ.8,500 వరకు పలుకుతుండడంతో దూదిపూలు సాగు చేసిన వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగునే ఉదాహరణగా తీసుకొని వ్యవసాయాధికారులంతా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మూస పద్ధతిలో ఒకే రకమైన పంటలు కాకుండా యాసంగిలో ఆరుతడి పంటలతోపాటు వాణిజ్య పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు వస్తాయని చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పత్తి పంట సాగు చేసిన వారికి పుష్కలంగా లాభాలు దక్కాయి. జుక్కల్, ఎల్లారెడ్డి, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అత్యధికంగా పత్తిని సాగు చేసిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రైతుకు లాభాలు వచ్చేలా సాగు..
యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నది. అదే సమయంలో బోర్ల కింద వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలు వేసేందుకు ప్రణాళికలు చేసుకోవాలని చాలా రోజుల నుంచి సలహాలు ఇస్తున్నాం. ఇందులో భాగంగా రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖతోపాటు అనుబంధ శాఖలతో కలిసి కార్యాచరణను సిద్ధం చేశాం. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందాలు, వెటర్నరీ, ఇతర అధికారులందరం కలిసి రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం.
వరి కన్నా పసుపు ఆదాయ పంట
వరి సాగు కన్నా పసుపుతోనే ఎక్కువ ఆదా యం వస్తుందని, పసుపు సాగు చేద్దామని నిర్ణ యించుకున్న. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వరి పంట వేసి ఇబ్బందులు పడే కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు సాగు చేసుకుంటే బాగుంటుంది.
ఆరుతడి పంటలే మేలు
వరి పంట సాగుజేసుడు కన్నా ఆరుతడి పంటలు సాగుజేస్తేనే మేలనిపిస్తున్నది. కేంద్ర సర్కారు వరి వద్దన్నప్పుడు.. వరి సాగుజేసి బాధపడే బదులు ఆరుతడి పంట వేసుకుంటేనే మంచిగుంటదని అనుకుంటున్న. తెలంగాణ సర్కారోళ్లు చెప్పినట్లు వరి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు సాగు చేద్దామనుకుంటున్నా.