ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కొవిడ్-19 కారణంగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించిందన్నారు. కేవలం ఇన్డోర్ సమావేశాలను 200 మంది, అవుట్డోర్ సమావేశాలను వెయ్యిమందికి లోబడి నిర్వహించుకునేలా ఆదేశాలు ఇచ్చినట్లు నారాయణరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, కామారెడ్డి జిల్లాలో మరో మూడు డివిజన్లతో మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.
నిజామాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదలతో ఎన్నికల హడావుడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటనతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నామినేషన్ల ప్రక్రియ త్వరలోనే మొదలు కానుండడంతో ముందస్తు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉం టుందని స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈసీ మార్గదర్శకాల మేరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు బాధ్యతతో మెదులుకోవాలని సూచించారు. ఎన్నికల నియమ, నిబంధనల మేర కు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. కొవిడ్-19 మూలంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు భారత ఎన్నికల సంఘం అనుమతు లు నిరాకరించిందని చెప్పారు. కేవలం ఇన్డోర్ సమావేశాలను 200మంది, అవుట్ డోర్ సమావేశాలను వేయి మందితోనే నిర్వహించుకునేలా ఆదేశాలు ఇచ్చినట్లు నారాయణ రెడ్డి వెల్లడించారు. అనుమతులకు సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల నిజామాబాద్ ఎమ్మెల్సీ పరిధిలో సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ఇద్దరు ఎంపీటీసీలకు ఓటు హక్కు ఉందని చెప్పారు.
ఆ ఇద్దరికి ఇక్కడే ఓటు…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జరుగుతున్నాయి. జిల్లాలు పునర్విభజనకు నోచుకోవడంతో ప్రస్తుతం సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు జరిగా యి. కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాత జిల్లా ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానాల గ్రామ ఎంపీటీసీ, సంగారెడ్డి జిల్లాలోని బాబుల్గావ్ ఎంపీటీసీలకు ఓటు హక్కు నిజామాబాద్ జిల్లాలో కలిగి ఉన్నట్లుగా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. వీరితో కలిపి మొ త్తం 824 మంది ఓటర్లున్నట్లు వెల్లడించారు. ఎక్స్ అఫీషియో మెంబర్లకు సైతం ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉందని కలెక్టర్ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతానికి తుది ఓటరు జాబితాను ప్రకటించలేదన్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించనున్నట్లుగా తెలిపారు. మార్పులు, చేర్పులకు వారం రోజుల సమయం కేటాయించనున్నట్లు నారాయ ణ రెడ్డి పేర్కొన్నారు. ఎవరైనా అర్హత ఉండి గత ఎన్నికల్లో ఓటరుగా నమోదు కాని వ్యక్తులుంటే ఈసీ నిబంధనల మేరకు అవకాశం కల్పిస్తామన్నారు. ఓటు హక్కు విషయంలో నిజామాబాద్ కలెక్టరేట్లో సంప్రదించాలని సూచించారు.
ఆరు పోలింగ్ కేంద్రాలకే ప్రతిపాదనలు…
గతేడాది అక్టోబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. తక్కువ మంది ఓటర్లున్నప్పటికీ కొవిడ్-19ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉండడంతో పాటు దాదాపు ఓటర్లందరూ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంతో పోలింగ్ కేంద్రాలు భారీ గా తగ్గే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. ఉప ఎన్నికల్లో మం డలానికో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రెవె న్యూ డివిజన్ కేంద్రాలను ఆధారంగా చేసుకొని పోలింగ్ కేం ద్రాలను ఏర్పాటు చేయాలని ఈసీ యోచిస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి నారాయణ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, కామారెడ్డి జిల్లాలో మరో మూడు డివిజన్లతో మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కు ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపినట్లు వివరించా రు. పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనకు రెండు రోజుల్లోనే ఆమో దం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నేడు ఉమ్మడి జిల్లా సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో గురువారం నిజామాబాద్ కలెక్టరేట్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి నేతృత్వంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అధికారులు భేటీ కానున్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ శాఖలకు చెందిన వారంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వీరి పరిధిలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుతో పాటు ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ మొత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే జరుగనుండడంతో ఇరు జిల్లాల అధికారులు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సమావేశంలో చర్చించనున్నారు.