కామారెడ్డి ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడుతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టంచేశారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన విజయవంతంగా సాగింది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతోపాటు కామారెడ్డిలో నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపారు. సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ గతానికీ, వర్తమానానికీ పరిస్థితులు ఎంతలా మారాయో వివరించిన ఆయన.. ప్రతిపక్షపార్టీలనూ తూర్పారబట్టారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్అలీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ కామారెడ్డి ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. అవాకులు చవాకులు పేలే బీజేపీ నాయకులకు దీటుగా సమాధానం ఇవ్వాలని శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డి జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగింది. కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతోపాటు టీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరై శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రతిపక్ష పార్టీలను తనదైన రీతిలో తూర్పారబట్టిన ఆయన… స్థానిక కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో నిర్వహించిన పార్టీ మీటింగ్లో పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అవాకులు, చవాకులు పేల్చే బీజేపీ నాయకులకు దీటుగా సమాధానం ఇవ్వాలని శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగుతూ పబ్బం గడిపారని దుయ్యబట్టారు. ఢిల్లీ బీజేపీ వరి పండించొద్దని చెబుతుంటే… సిల్లీ బీజేపీ మాత్రం వరి వేయాలంటూ రైతులను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు.
కామారెడ్డికి గోదావరి నీళ్లు…
కామారెడ్డికి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గోదావరి నీళ్లు వస్తాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ నేతృత్వంలోనే బీడు భూములకు జలాలు తరలిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఉండేనా అని ప్రశ్నించారు. 6గంటల కరెంట్ కూడా సక్కగ ఇవ్వలేదని, మూడు సార్లు ఇచ్చి గోస పెట్టిండ్రని, దీంతో ఎంతో మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. తెలంగాణలో ఒకప్పుడు సినీ కవులు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటలు రాశారని, ఇప్పుడు నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఆడబిడ్డలు చెబుతున్నారని కేటీఆర్ వివరించారు. ఒక్కో పిల్లాడి మీద రూ.1.20లక్షలు ఖర్చు పెట్టి వేయి గురుకులాల్లో 5లక్షల మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని చెప్పారు. ఏనాడైనా కాంగ్రెస్ పరిపాలనలో ఆలోచన చేసిండ్రా అని దుయ్యబట్టారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి ఇస్తుంది ఎవరో ప్రజలు గుర్తించాలని కోరారు. సమావేశంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్, మాజీ ఎమ్మెల్సీ అకుల లలిత, రాష్ట్ర గ్రంథాలయ సమితి చైర్మన్ అయాచితం శ్రీధర్, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్ రావు, పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకుడు పున్న రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇరవై ఏండ్ల సంబురం..
2021 ఏప్రిల్ 27 నాటికి టీఆర్ఎస్ విజయవంతంగా నిలదొక్కుకుని, అనుకున్న లక్ష్యాన్ని సాధించి రెండుసార్లు అధికారంలోకి రావడం మామూలు విషయం కాదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ పుట్టిన కొద్ది రోజులకే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ప్రజలు అత్యుత్తమ తీర్పునిచ్చారని తెలిపారు. నాడు రెండు జిల్లా పరిషత్లలో నిజామాబాద్ ఔట్ రైట్గా గెలిస్తే… కరీంనగర్లో వేరే వాళ్ల మద్దతుతో గెలిచామంటూ గుర్తు చేసుకున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఒక్కొక్కరినీ మెప్పిస్తూ ఇంత దూరం వచ్చామని, సావు నోట్లో తలపెట్టి ఆమరణ దీక్షకు దిగి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ అంటూ భావోద్వేగంతో కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఇష్టారాజ్య ప్రకటనలపై కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. ప్రజలందరికీ షబ్బీర్ తీరు అర్థమయ్యేలా ఓ పొడుపు కథను వివరించారు. వక్రబుద్ధితో తల్లిదండ్రులను చంపిన ఓ కొడుకు.. కోర్టు హాలులో న్యాయమూర్తితో తాను అనాథను వదిలేయాలని బతిమిలాడినట్లుగా షబ్బీర్ తీరు ఉందంటూ కథ రూపంలో వివరించారు. 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన షబ్బీర్ అలీ అప్పుడు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమాడా? అంటూ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఇప్పుడు సుందరంగా మారిందని కితాబునిచ్చారు. కరెంట్ మంత్రిగా రైతులకు కరెంట్ ఇయ్యలేక వారి ఉసురు తీసిన వ్యక్తి షబ్బీర్ అంటూ దుయ్యబట్టారు. ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లు తాగినోళ్లు అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదవారికి రూ.200 పింఛన్ ఇస్తే ఇప్పుడు 10 రెట్లు పెంచి కేసీఆర్ రూ.2వేలు అందిస్తున్నారని కేటీఆర్ చెప్పారు. బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లకు, ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనంటూ చెప్పారు.
సర్వతోముఖాభివృద్ధి..
కామారెడ్డిని జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సర్వతోముఖాభివృద్ధికి, ప్రతి పేదవాడి ముఖంలో సంతోషం చూపించడానికి కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని కేటీఆర్ తెలిపారు. మనకు సరిహద్దులో ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే పరిపాలన చేస్తున్నదని, అక్కడ ఓ బహిరంగ సభలో రాయ్చూర్ ఎమ్మెల్యే శివకుమార్ స్వయంగా రాష్ట్ర మంత్రిని వేలాది మంది ప్రజల సాక్షిగా నిలదీశాడని చెప్పారు. చాతనైతే పక్క రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేయాలన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. లేదంటే రాయ్చూర్ జిల్లాను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. పక్క రాష్ట్రంలోని బీజేపీ వాళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి ఇక్కడే ఉన్న బీజేపీ వాళ్లు కండ్లుండి చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి, మోచేతికి బెల్లం పెట్టి ఆశచూపిన వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని, రెండు ఫీట్లున్నోడు కూడా ఎగిరెగిరి మాట్లాడుతున్నారని, కెమెరాలు పెట్టగానే, ఫ్లెక్సీలు కట్టగానే లీడర్లు అయిపోయినట్లు కాదంటూ చెప్పారు.
అబద్ధాలకు కేరాఫ్ బీజేపీ..
తెలంగాణ అభివృద్ధిని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుంటుండగా లోకల్ బీజేపీ వాళ్లు అవగాహన రాహిత్యంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం రెండున్నర శాతమేనని, దేశంలో 5శాతం జీడీపీకి దోహదం చేస్తున్నదని ఆర్బీఐ చెప్పిందని గుర్తుచేశారు. ఆర్థికంగా దేశాన్ని సాదుతున్న దాంట్లో నాలుగో స్థానంలో తెలంగాణ ఉన్నదని కేటీఆర్ చెప్పారు. రెండు రోజులుగా సీఎం కేసీఆర్ మాటలకు బీజేపీ వాళ్లు సమాధానం లేక నీళ్లు నములుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రశ్నకు సక్కగా జవాబు ఇచ్చేందుకు చాతనైతలేదంటూ దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు బ్రాండ్ అంబాసిడర్గా పని చేసిండని అన్నారు. మిషన్ కాకతీయ చెరువు కట్టలపై నడిచి, కేసీఆర్ ఇచ్చిన చేపలను పట్టుకుని, కేసీఆర్ పంచిన గొర్రెలు పట్టుకుంటూ, కేసీఆర్ నిర్మించిన రైతు వేదికల్లో నిద్రిస్తూ, కేసీఆర్ పెట్టించిన చెట్ల మధ్య ఫోజులిస్తూ కేసీఆర్ గొప్పతనాన్ని వివరించాడని తెలిపారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రంలో ఏ ఒక్క పల్లెనైనా మన కామారెడ్డి పల్లె మాదిరిగా ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన రైతుబంధును చూసి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో కాపీ కొట్టారన్నారు.
అసత్యప్రచారాలను తిప్పికొడదాం..
కామారెడ్డి, నవంబర్ 9: పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు చేస్తు న్న ఆరోపణలను తిప్పికొట్టాలి. 14ఏండ్లు అవిశ్రాంత పోరాటం చేసి మడమతిప్పకుండా రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దిన కేసీఆర్ కుటుంబ సభ్యులం మనం. ఘన చరిత్ర కలిగిన కేసీఆర్ కుటుంబంలో ఉన్నం. అభివృద్ధి చేస్తున్న కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడుతున్న వారిని తిప్పికొట్టాలి. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేనా.. అడుగడుగునా నిలబెట్టి ఎదుర్కోవాలి. మన నాయకుడిని ఒంటరిగా వదిలిపెడదామా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిని వదిలిపెడదామా? ఇక వినేది లేదు, ఆగేది లేదు.
-వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి
తెలంగాణ అంటేనే అభివృద్ధి..
కామారెడ్డి, నవంబర్ 9: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్నది. తెలంగాణలో ఉన్న ఒక్క పథకమైనా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రలో ఉంటే ముక్కు నేలకు రాస్తాం. ఇక్కడి అభివృద్ధిని కేంద్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రశంసిస్తుంటే తెలంగాణ బీజేపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. తప్పుడు ప్రచారాలపై కార్యకర్తలు ఊరుకోవద్దు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలి.
పని చేసే ప్రభుత్వం మనది..
కేసీఆర్ సారథ్యంలో ఏడేండ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభు త్వం మాటలు చేప్పేది కాదు. పని చేసి చూపించేది. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటినీ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుపై దృష్టి పెట్టాం. దీంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.