కంటోన్మెంట్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీటి ఎద్దడితో కంటోన్మెంట్లో జనం అవస్థలు పడుతున్నారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా నివేదితను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈ నెల 19న కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత నామినేషన్ వేస్తారని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే ఎలాంటి లాభం లేదని, దొందు దొందేనని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తేనే కంటోన్మెంట్ అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఏకగ్రీవానికి ఇతర పార్టీలు సహకరించాలని కోరారు. కంటోన్మెంట్లో సొంతిల్లు కూడా లేకుండా అతి సాధారణ జీవితం గడుపుతున్న సాయన్న కుటుంబానికి అందరూ అండగా నిలవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రూప, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.