నీతా అంబానీ.. ఈ మధ్యే రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకొన్నారు. అలా అని ఆమె బాధ్యత తీరిపోలేదు. మరింత పెరిగింది. రిలయన్స్ ఫౌండేషన్ అధినేత్రిగా పూర్తి చేయాల్సిన పనులు, సాధించాల్సిన విజయాలు, చేరాల్సిన గమ్యాలు చాలానే ఉన్నాయి. ‘దేశవ్యాప్తంగా యాభైనాలుగు వేల గ్రామాల రూపురేఖలను మార్చడం నా తక్షణ కర్తవ్యం’ అంటారామె. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళికను ఇలా వివరించారు.. ‘సంస్కృతి నుంచి వాతావరణం వరకు, చదువుల నుంచి క్రీడల వరకు.. అన్నిటికీ మించి మహిళా సాధికారతకు నేను చేయాల్సింది చాలా ఉంది.
గ్రామీణ కళాకారుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దడానికి మేం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏ ఒక్క ప్రాచీన కళా.. ఆదరణ లేని కారణంగా అంతరించిపోకూడదు. ఏ సంప్రదాయ కళాకారుడూ ప్రోత్సాహం కరువై పస్తులు ఉండకూడదు. భారతీయ ఆత్మను రేపటి తరాల గుండెల్లో నింపేందుకు విద్యా రంగంపైనా దృష్టిపెడుతున్నాం. బడి బావుండాలంటే గురువులు సమర్థులు కావాలి. అందుకే, ప్రపంచశ్రేణి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించే ఆలోచన ఉంది’. కలల్ని నిజం చేసుకోవాలంటే.. లక్ష్యశుద్ధి ఉండాలి, ‘విత్త’శుద్ధీ ఉండాలి. అంబానీల కోడలికి ఈ రెండూ పుష్కలమే.