వనపర్తి : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి మార్కెట్ యార్డులో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు సంఘీభావం తెలిపి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజుల తరబడి కల్లాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా కాంటా పెట్టడం లేదని మండిపడ్డారు.
కండ్లముందే ధాన్యం నీటి పాలవుతుంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలేని ట్రాన్పోర్ట్ ఏజెన్సీలకు కాంటాక్టులు ఇవ్వడం వల్ల రైతులకు ఈ దుస్థితి దాపురించిందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెట్టడం చేతనైతది కానీ శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేండ్లు అయిన నేటికి హంతకులను పట్టుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ధాన్యం కొనుగోలు చేశాం అని బాధ్యతారహితంగా ప్రకటనలు చేశార్నారు.
కేసీఆర్ హయాంలో తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజా కొని రైతులను ఆదుకున్నారురని గుర్తు చేశారు. 5లక్షల 42వేల హెక్టార్లలో ధాన్యం పండింది. కానీ కొనే నాథుడేలేడన్నారు. సివిల్ సప్లైస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర అర్హతలేని ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కో మిల్లర్ మంత్రి కుమారునికి రేంజ్ రోవర్ కార్ బహుమతిగా ఇచ్చారని, దీనిపై విచారణ చేపట్టాలన్నారు. పక్షపాతం చూపకుండా అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలన్నారు. కోటి నలభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మార్కెట్ కు వస్తుంది. 45లక్షల మక్కజొన్న మార్కెట్ కు వచ్చింది.
రైతులను గాలికి వదిలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. అక్రమార్కులకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. 90శాతం ధాన్యం ఆరు పెద్ద మిల్లులకు పోతుందన్నారు. 90శాతం పాడి ఆరు పెద్ద మిల్లులకు పోతుంది విచారణ చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్కెట్ మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, పలుస రమేష్ గౌడ్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు మాణిక్యం, వనం రాములు, జోహెబ్ హుస్సేన్, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, సయ్యద్ , జెమిల్, బాగ్యరాజ్ తదితరులు ఉన్నారు.