Stock Market : పశ్చిమాసియా (West Asia) లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడిచమురు ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ కీలక సూచీలు 1 శాతానికి పైగా పతనమయ్యాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ (Sensex) 800 పాయింట్లకుపైగా నష్టపోయి 73,421 వద్ద ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ (Nifty) కూడా 286 పాయింట్లు కోల్పోయి 23,080 వద్దకు జారుకుంది.
దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా రియల్టీ, మెటల్, ఆటో, ఐటీ రంగాల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. రియల్టీ సూచీ దాదాపు 2 శాతం పడిపోగా, మెటల్, ఆటో, ఐటీ సూచీలు 1 శాతానికి పైగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీలో విప్రో, టీసీఎస్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి షేర్లు మేజర్ లూజర్లుగా నిలిచాయి. ఫ్రంట్లైన్ సూచీలతోపాటు మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 1 శాతం మేర పతనమయ్యాయి.
మార్కెట్లలో భయానికి సూచికగా భావించే ఇండియా విక్స్ (VIX) ఏకంగా 15 శాతం పెరిగి 18 స్థాయికి చేరడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనను సూచిస్తోంది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య దాడులు పునరుద్ధరించడం, ఇరాన్లోని పలు నగరాల్లో పేలుళ్లు సంభవించాయన్న వార్తలు అంతర్జాతీయంగా ఆందోళనలను పెంచాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే ముడిచమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయాలు పెరిగాయి.
దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 శాతం పెరిగి బ్యారెల్కు 96.90 డాలర్లకు చేరింది. కానీ మధ్యాహ్నానికి మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ నష్టం 420 కి తగ్గింది. అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ నష్టం కూడా 140 కి తగ్గింది.