న్యూఢిల్లీ : గుజరాత్ ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ.21వేలకోట్ల విలువైన 2,988 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బదిలీ చేయగా.. డీఆర్ఐ నుంచి కేసును స్వాధీనం చేసుకొని.. విచారణ ప్రారంభించింది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించిన కేంద్రం కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల రవాణాపై విచారణ జరుపనుంది.
ఆఫ్ఘన్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్లోని ముంద్రా పోర్టుకు ‘సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్’గా రవాణా చేసిన విషయం తెలిసిందే. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) సెప్టెంబర్ కచ్ జిల్లాలోని ముంద్రా పోర్టులో రెండు కంటైనర్ల నుంచి 2,988.21 కిలోల హెరాయిన్ను ఢిల్లీకి తరలించేందుకు యత్నిస్తుండగా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
పట్టుకున్న డ్రగ్స్ చిరునామా ఏపీలోని విజయవాడ ఆషీ ట్రేడింగ్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి ఇందులో ప్రాతధారిగా ఉన్నాడని విచారణ సంస్థలు గుర్తించారు. తన భార్య పేరిట కంపెనీని రిజిష్టర్ చేయించి, దాన్ని మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు అందజేశాడని విచారణ సంస్థలు తేల్చాయి. గతేడాది సైతం దాదాపు 25వేల టన్నుల హెరాయిన్ ఆఫ్ఘన్ నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని పలు ఇతర ప్రాంతాలకు తరలించినట్లు గుర్తించారు.