గోదావరిఖని, అక్టోబర్ 6: గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. కాగా, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్థలంలోనే ఈ మోడల్ పోలీస్ స్టేషన్ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఇందుకు సింగరేణి రూ.3.40 కోట్లు నిధులు సమకూర్చిం ది.
పాత డిగ్రీ కళాశాల స్థలంలో పోలీస్ విశ్రాంతి భవనాన్నీ అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇందుకు ఎన్టీపీసీ సంస్థ రూ.3.50 కోట్లు సమకూర్చింది. అంతర్గాంలో మోడల్ పోలీస్ స్టేషన్కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.1.50కోట్లతో నిర్మించారు. ఈ భవనాల నిర్మాణాలు గతంలోనే పూర్తి కాగా, పరిస్థితులు అనుకూలించక ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పోలీస్ హౌసింగ్ కార్పొరేష న్ చైర్మన్ కోలేటి దామోదర్ సీఎం దృష్టికి తీసుకవెళ్లి ప్రారంభించి వినియోగంలోకి తేవాలని విన్నవించగా ఎట్టకేలకు 11వ తేదీన ప్రారంభం చేయనున్నారు. రాష్ట్ర హోంమంత్రి, డీజీపీలతో పాటు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎంపీ వెంకటేశ్ కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గోదావరిఖనిలోనే అత్యధిక కేసులు నమోదయ్యే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆధునీకరించి మోడల్ స్టేషన్ నిర్మించడంలో కోలేటి దామోదర్ కృషి చేశారు.