హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్కు ఈ ఏడాది నుంచే కొత్త కరికులాన్ని అమలు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు నూతన విద్యావిధానంలో పాఠాలు బోధించాలని గురువారం ఆదేశాలు జారీచేసింది. వైద్యరంగంలో వస్తున్న అత్యాధునిక టెక్నాలజీలు, కొత్త వ్యాధులకు అనుగుణంగా, ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకొనేలా ‘కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్’ పేరుతో నూతన కరికులాన్ని రూపొందించారు. ఇందులో రెగ్యులర్ పాఠాలతోపాటు ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్, యోగా, మెడిటేషన్ వంటి వాటితోపాటు స్థానిక భాషలకు ప్రాధాన్యం, నైపుణ్యాలు పెంచుకోవటం వంటి అంశాలు ఉన్నాయని ఎన్ఎంసీ తెలిపింది. కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని నూతన విధానంలో విద్యార్థులకు ప్రత్యేక సమయపాలనను అమలు చేస్తున్నట్టు వివరించింది. నూతనంగా అడ్మిషన్లు పొందిన 2021-22 బ్యాచ్కు అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ సదుపాయం కల్పించనున్నట్టు దివ్యాంగుల సంక్షేమశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించనివారు ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు కింద కనిష్ఠంగా రూ.7 వేలు, గరిష్ఠంగా రూ.20 వేలు, స్టడీ మెటీరియల్కు రూ.1,000, ఇతర ఖర్చులకు రూ.రెండు వేల చొప్పున మూడు నెలల పాటు సహాయం అందజేయనున్నట్టు పేర్కొన్నది. అభ్యర్థులు ఏప్రిల్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలకు 040-4559048 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నది.