శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఊరుకోం
సైబర్ నేరాలను ఛేదించే సత్తా నగర పోలీసులకు ఉంది
నగర సీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
సిటీబ్యూరో, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): ‘సైబర్ నేరాలను ఛేదించే సాంకేతిక పరిజ్ఞానం హైదరాబాద్ పోలీసులకు ఉంది. వాటి ద్వారా సైబర్ క్రైమ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం’ అని నగర కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో ఉండి అవినీతి నిరోధకశాఖ డీజీగా బదిలీ అయిన అంజనీకుమార్ సీవీ ఆనంద్కు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ తనను కమిషనర్గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా మారాయని, వాటికి ఎవరూ విఘాతం కలిగించినా.. వదలమని హెచ్చరించారు. సిటీలో ట్రాఫిక్ రద్దీపై ప్రత్యేక దృష్టిని పెట్టి..సాఫీ ప్రయాణానికి కృషి చేస్తానని చెప్పారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని.. నేరస్తుల భరతం పడతామన్నారు. ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ను సమర్థవంతంగా అందిస్తామన్నారు. నగరంలో పుట్టి, ఇక్కడే తిరిగిన సిటీకి పోలీసు కమిషనర్గా బాధ్యతలను చేపట్టడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
నిబంధనలు పాటించాలి…
ఒమిక్రాన్, కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి నేపథ్యంలో నగర ప్రజలు కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
నార్త్జోన్ డీసీపీగా చందన దీప్తి
సికింద్రాబాద్, డిసెంబర్ 25: నార్త్జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)గా చందన దీప్తి నియమితులయ్యారు. మెదక్ ఎస్పీగా పనిచేస్తున్న ఆమె బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.మెదక్ ఎస్పీగా పనిచేస్తూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్పై ప్రత్యేక శ్రద్ధ వహించి.. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారు. 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిణి అయిన చందన దీప్తి మొదటగా నల్లగొండలో ప్రొ బెషనరీ ఆఫీసర్గా విధులు నిర్వర్తించారు. అనంతరం తాండూరు ఏఎస్పీగా, నిజామాబాద్ ఓఎస్డీగా పనిచేశారు. 2013 నుంచి మెదక్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన బదిలీల్లో భాగంగా నార్త్జోన్ డీసీపీగా నియామకమయ్యారు.