హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): అమ్మఒడి (102 సర్వీస్) వాహనాల ద్వారా నెలకు దాదాపు లక్ష మంది గర్భిణులు సేవలు పొందుతున్నట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గర్భిణులను వైద్య పరీక్షలు, ప్రసవం నిమిత్తం ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటివద్ద దిగబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని 2017 జూన్ 2న ప్రారంభించారు. వీటితోపాటు అత్యవసర వైద్యసేవలకు వినియోగించే 108, 104, దవాఖానల్లో మృతిచెందిన వారి పార్థివదేహాలను సొంతూళ్లకు తరలించేందుకు ప్రవేశపెట్టిన పార్థివ వాహనాలు కూడా ఉత్తమ సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నది.