న్యూఢిల్లీ: ఆత్మహత్యలపై కేంద్ర హోంశాఖ ఇవాళ ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2018, 2019, 2020 సంవత్సరాల్లో 1,34,516, 1,39,123, 1,53,052 మంది బలవన్మరణానికి పాల్పడినట్లు మంత్రి తెలిపారు. అయితే ఇక 18 ఏళ్ల నుంచి 30 లోపు యువతలో 46912, 48774, 52718 మంది మరణించినట్లు ఆయన వెల్లడించారు. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా పేరుతో ఎన్సీఆర్బీ డేటాను రిలీజ్ చేసింది. సూసైడ్ రేటును కూడా ఆ డేటాలో పొందుపరిచారు. 2016, 2017, 2018, 2019 & 2020లో లక్ష మంది జనాభాలో సూసైడ్ రేటు 10.3, 9.9, 10.2, 10.4 & 11.3గా ఉన్నట్లు పేర్కొన్నారు. అనేక కారణాలు ఆత్మహత్యలకు దారి తీసినట్లు తెలిపారు. కుటుంబం, పెళ్లి, వివాహేతర, ప్రేమ, విడాకులు, ప్రాపర్టీ సంబంధిత సమస్యలు వాటిల్లో ఉన్నాయి. 2019 నుంచి 2021 వరకు 81 మంది చైనా జాతీయులకు లీవ్ ఇండియా నోటీసు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 117 మందిని డిపోర్ట్ చేశామని మంత్రి నిత్యానంద చెప్పారు.