భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నామని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో శనివారం కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన నిర్వహించిన 250 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నదన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసే అదృష్టం కల్పించిన సీం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందాన్నిస్తున్నదన్నారు. రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. మేళతాళాల నడుమ ఊరేగింపు వైభవంగా సాగింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ వినీత్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ కమిషనర్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ నవీన్, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ కుమారస్వామి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ జెండా.. దేశ ప్రజలందరికీ అండ
మామిళ్లగూడెం, ఆగస్టు 13: జాతీయ జెండా దేశ ప్రజలందరికీ అండ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని అంబేద్కర్ సెంటర్లో రెండ కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శనను ప్రారంభించారు. 10వేల మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుల ఆశయాలను సాధించేందుకు యువత కృషి చేయాలన్నారు. వారి త్యాగాలు స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని నవశకం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరిలో దేశభక్తిని నింపేలా ఈ నెల 22 వరకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నదన్నారు. వజ్రోత్సవాల్లో ప్రతిఒకరూ భాగస్వాములు కావాలన్నారు. 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలన్నారు. ప్రదర్శన ఐటీ హబ్ సెంటర్ మీదుగా సర్దార్ పటేల్ స్టేడియం వరకు సాగింది. ప్రదర్శనలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సౌట్స్ అండ్ గైడ్స్ క్యాడెట్స్, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.
16న నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. అన్ని ప్రధాన కూడళ్లు, మైదానాల్లో ఉదయం 11.30 గంటలకు ఎక్కడి వారు అక్కడే ఉండి జాతీయ గీతం ఆలపించాలన్నారు. ప్రదర్శనలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, అడిషనల్ డీసీపీలు డాక్టర్ శబరీశ్, సుభాశ్ చంద్రబోస్, డీఆర్డీవో విద్యాచందన, జిల్లా యువజన అధికారి పరంధామరెడ్డి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు పాల్గొన్నారు.