మన ఆహారాల్లో మసాలాలది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి. మసాలా ధినుసులతో ఆరోగ్యం పొందవచ్చని పలు పరిశోధనలు తేల్చాయి. వంటింటి ఔషధాలుగా చెప్పుకునే మసాలాలు తినేవారిలో అనేక పోషకాలు, విటమిన్లు అందుతున్నాయి. అయితే, మసాలా ధినుసులు కాలుష్యంగా మారిపోతుండటం, నకిలీలు పుట్టుకొస్తుండటంతో ఆరోగ్యం స్థానంలో అనారోగ్యం వచ్చి చేరుతున్నది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు అమెరికాకు చెందిన నాసా అంతరిక్ష పరిశోధనలు చేపట్టి స్పేస్లోనే మసాలాలను పండించడం ప్రారంభించింది. అంతా సవ్యంగా సాగితే సమీప భవిష్యత్తులో నాసా తన సొంత స్పేస్ మసాలాలను విక్రయించనున్నది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగాములు తొలిసారిగా అంతరిక్ష కేంద్రంలో చిలీ మిరియాలు పెంచుతున్నారు.ఎందుకంటే.. మానవులను అంగారక గ్రహానికి పంపాలంటే వారికి మసాలా దినుసులు అవసరం. అందుకే అని నాసా స్పష్టం చేస్తున్నది.నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ ఇటీవల వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియోను షేర్ చేసింది. ‘చిలీ మిరియాలు @ స్పేస్ స్టేషన్లో పెంచుతున్నాం. అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆస్ట్రోనాట్ షేన్ కింబ్రో ఇటీవలనే హాబిటాట్-04 ప్రయోగానికి నీటిని అందించారు. 4 నెలల్లోపు నాసా వ్యోమగాములు ఈ మొదటి పంటను కోస్తారు’ అని నాసా అధికారులు ట్వీట్ చేశారు.
హాచ్ చిలీ పెప్పర్ విత్తనాలను కలిగి ఉన్న నాసా ప్లాంట్ హాబిటాట్-04 (పీహెచ్-04) ప్రయోగం జూన్ నెలలో స్పేస్ ఎక్స్ 22 వ మిషన్లో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. నాసా వ్యోమగామి షేన్ కింబ్రో ప్రారంభించిన ఈ ప్రయోగంలో 48 హాచ్ చిలీ పెప్పర్ విత్తనాలను అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ (ఏపీహెచ్) లో పండిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలోని మొక్కల పెరుగుదల గది మన వంటగదిలోని ఓవెన్ పరిమాణం అంత ఉంటుందని నాసా తెలిపింది. పంట కోతకు సిద్ధం కావడానికి మూడున్నర నెలల సమయం పట్టనున్నదని నాసా పేర్కొన్నది.
మొక్కల పెరుగుదల గది ఏపీహెచ్లో పెరుగుతున్న మిరియాలు న్యూ మెక్సికోకు చెందిన న్యూమెక్స్ ‘ఎస్పానోలా ఇంప్రూవ్డ్’, హైబ్రిడ్ పెప్పర్ రకం. వీటిని తరచుగా హాచ్ వ్యాలీలో పండిస్తారు. ఈ మిరియాలు రుచిగా ఉండటమే కాకుండా విటమిక్ సీ అధికంగా కలిగి ఉంటుంది. ఒక నారింజ పండులో లభించేదాని కంటే ఎక్కువ మొత్తంలో విటమిన్ సీ ఈ మిరియాల్లో ఉండనున్నది.
నాసా వ్యోమగామి షేన్ కింబ్రో విమాన ఇంజనీర్. అంతరిక్షంలో పంటలు పండించిన గత అనుభవం ఈయనకు ఉన్నది. కింబ్రో 2016 చివరలో ‘ఔట్రెడ్జియస్’ రెడ్ రొమైన్ పాలకూరను పెంచడంలో, ఆహారంగా తీసుకోవడంలో కృషి చేశారు. అంతా సవ్యంగా సాగితే రానున్న రోజుల్లో స్పేస్ మసాలాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి.
కరోనా ట్రైలరే.. ముందుంది ముసళ్ల పండుగ : రిచర్డ్ సెనెట్
చరిత్రలో ఈరోజు.. భారత స్వాతంత్య్ర చట్టానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం
సువేందు మెడకు బాడీగార్డ్ మృతి కేసు
ఆ ఫొటో జర్నలిస్ట్ను మేం చంపలేదు : తాలిబాన్
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..