న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన పుతిన్తో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సంమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్తో యుద్ధానికి సహాకారం అందిస్తున్నదంటూ భారత్పై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. భారీ సుంకాల తర్వాత మోదీ, పుతిన్ తొలిసారిగా భేటీ అవుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వీరి సమావేశంపై అమెరికా కూడా ప్రత్యేకంగా దృష్టిసారించింది. కాగా, ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ సమావేశమైన విషయం విధితమే. ఈ సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒప్పందం నుంచి కైలాస మానససరోవర్ యాత్ర పునః ప్రారంభం, రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునరుద్ధరణ వరకు ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పురోగతిని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు ఈ రెండు దేశాల సహకారంతో ముడిపడి ఉన్నాయని, సర్వ మానవాళి సంక్షేమానికి ఇది మార్గదర్శనం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
డ్రాగన్, ఏనుగు ఒక్కటవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. బీజింగ్కు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన మిత్రుడని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మకంగా, సుదీర్ఘకాల దృక్పథంతో ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. స్నేహితులుగా ఉండటం, మంచి పొరుగువారిగా ఉండటం, డ్రాగన్, ఏనుగు కలిసి రావడం చాలా ముఖ్యమని చెప్పారు.
సరిహద్దు సమస్య భారత్-చైనా సంబంధాన్ని నిర్వచించనివ్వకూడదని జిన్పింగ్ పేర్కొన్నట్టు ఆ దేశ పత్రిక జిన్హువా వెల్లడించింది. కాగా, భారత్-చైనా సరిహద్దు సమస్యపై న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు కలిసి పనిచేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంగీకరించారు. పరస్పర విశ్వాసం, గౌరవం భారత్-చైనా సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.