మంచిర్యాలటౌన్, ఆగస్టు 6 : మంచిర్యాలలోని రాళ్లవాగులో కొట్టుకు పోయిన పైపులైన్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి తాగునీరు సరఫరాకాక గురువారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి. ఈ సమస్య ఇన్ని రోజులు కొనసాగడానికి పాలక, అధికార పక్షాల అనుభవ లేమి, అవగాహనరాహిత్యమేనన్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. గడిచిన 60 ఏళ్లలో ఏనాడూ నీటి సరఫరా నిలిచిపోలేదని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రేయింభవళ్లు కష్టపడి ఒకటీ రెండు రోజుల్లో నీటి సరఫరా చేసిన సందర్భాలు ఉండేవని, అప్పుడు ఇంతకన్నా పెద్దసమస్యలు ఎదురయ్యాయని, ఇపుడున్నంత టెక్నాలజీ కూడా అప్పుడు ఉండేది కాదని చెబుతున్నారు. జూలై నెల చివరివారంలో కురిసిన వర్షానికి రాళ్లవాగు ప్పొంగి ప్రవహించింది. అయితే మిషన్ భగీరథ ఆధ్వర్యంలో జలగుట్ట నుంచి పట్టణంలోని వాటర్ ట్యాంకులకు నీరు సరఫరా చేసే ప్రధాన పైపులైన్లు ఈ రాళ్లవాగులోని రంగంపేట కాజ్వే పక్కనుంచే నిర్మించారు.
వరద ఉధృతి కారణంగా పైపులైన్లు కొట్టుకుపోయిన విషయాన్ని మూడురోజులకు గుర్తించిన అధికారులు తిరిగి పైపులైన్లను పున:రుద్ధరించడంలో అపసోపాలు పడుతున్నారు. మరో పక్క లక్షకు పైగా జనాభా ఉన్న మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ నల్లానీటిపైనే ఆధారపడే కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరంతా తాగునీటితో పాటు వారి ఇంటి అవసరాల కోసం ఉపయోగించే నీటికోసం తండ్లాడుతున్నారు. పైపులైను మరమ్మతులు చేపడుతున్నా, రాళ్లవాగులో నీటి ప్రవాహం తగ్గని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాగులోని ప్రవాహాన్ని మరో పక్కకు మరల్చే చర్యలు చేపడుతున్నారు. దీంతో సమస్య కొలిక్కి వస్తుందన్న ఆలోచనతో ఉన్నారు.