యాదాద్రి, మే 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నృసింహుడి జయంత్యుత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం స్వామి, అమ్మవార్లకు సుప్రభాతం అనంతరం అభిషేకం, నవకలశ స్నపనం నిర్వహించారు. నిత్య మూలమంత్ర హవనం చేపట్టి ప్రధానాలయ ముఖ మండపంలో లక్ష కుంకుమార్చన చేశారు.
అనంతరం స్వామివారిని కాళీయమర్ధనుడిగా అలంకరించి ప్రధానాలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం నృసింహ మూలమంత్ర హవనం, హనుమంత వాహనంపై రామావతారం అలంకార సేవలో స్వామివారిని ఊరేగించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోనూ జయంతి ఉత్సవాలు ఘనంగా సాగాయి. వేడుకల్లో ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.