హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై తిరుగుబాటు తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హెచ్చరించారు. దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, జాతిని భ్రష్టుపట్టిస్తున్న బీజేపీకి చరమగీతం పాడాల్సిందేన్నారు. కేంద్రానికి ఉండాల్సిన స్వావలంబన లక్షణం బీజేపీ పుణ్యమా అని స్వాహాలంబనగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల కారణంగా దేశ రైతాంగం ఆగమవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లౌకిక, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పనితీరును మీరెలా విశ్లేషిస్తారు?
ఫక్తు దళారీ పాత్ర పోషిస్తున్నది. దేశాన్ని అప్పుల్లోకి, ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నది. ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారు. తిరోగమన విధానాలను అనుసరిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలకు స్వావలంబన ఆలంబనగా ఉండేది. ఇప్పుడది స్వాహాలంబనగా మారిపోయింది. కరోనా భుజం మీద తుపాకీ పెట్టి సర్వ వ్యవస్థలను నాశనంచేస్తున్నారు. దేశంలో సమస్త వ్యవస్థలు కరోనాతో కకావికలం అవుతుంటే అదానీ, అంబానీ ఆస్తులు రెండింతలు పెరిగాయి.
రైతు చట్టాలను రద్దుచేసి ప్రధాని మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పారు కదా.. మీ కామెంట్..?
ఈ చట్టాలను రద్దు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దేశవ్యాప్తంగా రైతాంగం బీజేపీపై తిరగబడింది. అది అన్ని వర్గాలకు విస్తరిస్తే తమ ఉనికికే ప్రమాదమని మోదీ గ్రహించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు చట్టాలను రద్దు చేశారే తప్ప రైతుల మీద ప్రేమలేదు. ఈ పోరాటంలో మరణించిన 750 రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్చేస్తుంటే, అసలు రైతులే చనిపోలేదన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. లఖింపూర్కేరీలో కేంద్రమంత్రి కొడుకే తన కాన్వాయ్ను పోనిచ్చి రైతులను పొట్టనబెట్టుకున్నాడు. అయినా చర్యలు తీసుకోలేదు. బీజేపీ దశలవారీగా అన్ని వర్గాలను బుల్డోజ్ చేస్తున్నది.
వ్యవసాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానం ఎలా ఉన్నది?
పడావు పడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది. వ్యవసాయాన్ని బాగుచేసుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగైన అడుగులు వేస్తున్నది. రైతుబంధు ద్వారా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేస్తున్నది. విద్యుత్తు రంగాన్ని గాడిన పెట్టింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నది. రైతుబీమా పథకం రైతుల కుటుంబాలకు ఉపశమనాన్ని ఇస్తున్నదనడంలో సందేహం లేదు. సాగునీటి సౌకర్యం పెరిగింది. ఇతర హామీలను నెరవేర్చడానికి మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది. వివిధ అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మీ కామెంట్?
సాఫీగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను జటిలం చేసింది. ఎఫ్సీఐని నిర్వీర్యంచేసి, అమ్మివేయాలన్న కుట్రల్లో భాగంగానే కొనుగోళ్ల బాధ్యత నుంచి కేంద్రం తప్పుకొంటున్నది. దేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడం కేంద్రం విధి. కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకొంటే కనీస మద్దతు ధర చెల్లించాల్సిన అవసరం ఉండదనేది మరో కుట్ర. రైతాంగాన్ని నిర్వీర్యంచేసి, బతుకలేని స్థితికి నెట్టివేయటమే బీజేపీ ఎత్తుగడ. దీనిపై తిరుగుబాటు చేయాల్సిన అనివార్యత నెలకొన్నది. వ్యవసాయాన్ని ధ్వంసంచేయడమే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపీపై రైతాంగం మరింత ఉద్ధృతంగా పోరాడాలి.
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం కూడా అభివృద్ధే అని వాదిస్తున్న బీజేపీ నేతలకు మీ సమాధానం?
మరి రేపేమి అమ్ముతారు? ఇంతకన్నా దౌర్భాగ్య వాదన ఉంటుందా? ఇది ప్రభుత్వమా లేక దళారీనా? ఎక్కడైనా నష్టాల్లో ఉన్న సంస్థలను బాగుచేయడానికి, పునరుద్ధరించడానికి ఆలోచిస్తారు. కేంద్రం మాత్రం లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, పోర్టులు, రైల్వేలు ఇలా అన్నింటినీ అమ్మేస్తున్నది. తద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి రంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లబోతున్నది. యువత దిక్కుతోచని స్థితిలోకి జారిపోతుంది. రిజర్వేషన్ వ్యవస్థ నామరూపాల్లేకుండా పోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రాజ్యాంగ ఫలాలను దూరంచేయడమే మోదీ విధానంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి.