సిద్దిపేట, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వార్థ రాజకీయం కోసమే తెలంగాణ విమోచన దినం పేరిట బీజేపీ ఏవో కార్యక్రమాలు చేస్తున్నదని, ఈ మత పిచ్చి పార్టీ ఏదో లబ్ధి పొందడానికి చేస్తున్న తాపత్రయమేనని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గాంబీరపు రామయ్య తేల్చి చెప్పారు. అందుకే.. వారు పిలిచినా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో సమావేశానికి వెళ్లలేదని తెలిపారు. ‘తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు బీజేపీ ఉనికే లేదు. తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే లేదు.. కమ్యూనిస్టులు మాత్రమే ఉండిరి’ అని అన్నారు. బాంచన్ అని కాళ్లు పట్టిన చేతులే బందూకు పట్టినాయని, గట్టిగా ఎక్కడి వారు నిలబడటంతోనే హైదరాబాద్ భారత్లో కలిసిపోయిందని చెప్పారు. ఆదివారం నమస్తే తెలంగాణ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు.ఇవీ వివరాలు..
తెలంగాణ సాయుధ పోరాట జ్ఞాపకాలు వివరించండి
నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎందరో అమరులైనారు. ప్రభాకర్రావు ఎన్కౌంటరైన తర్వాత అప్పటి నల్లగొండ జిల్లా జనగామ తాలూకాకు చెందిన మురళీధర్రావు నాయకత్వం వహించారు. స్టేషన్ ఘనపూర్ ప్రాంతానికి చెందిన ముకుందరెడ్డి ఉప నాయకుడుగా ఉండేవారు. వడ్లకొండ నరహరి రావుతోపాటు చాలామందిమి దళంలో పనిచేశాం. అప్పుడు పోరాటం జరిగేందుకు ప్రధాన కారణం ఏమిటంటే.. అప్పుడు పంట పండినా, పండకున్నా ఎకరానికి గింత అని ఇయ్యాలె అని ఉండె. వాళ్లు అప్పటి ప్రభుత్వానికి ఎంత ఇచ్చేది తెలియదు కానీ. ఊర్లో మాత్రం రైతుల వద్ద నుంచి పట్వారీ వసూలు చేసేవారు.
సాయుధ పోరాటానికి మొదలు చేనేత కార్మికులకు నూలు దొరకలేదు. చాలా కంట్రోల్ అయింది. అప్పుడు ప్రభాకర్రావు చేనేత కార్మికులకు కూపన్ ఇప్పించిండు. ఇట్లా అనేక కారణాల వల్ల సాయుధ పోరాటం మొదలైంది. ఆ కాలంలో గుండి(కల్వకోట) దామోదర్రావు, ప్రభాకర్రావును గృహ నిర్బంధం చేశారు. వాళ్లు తప్పించుకొని గుడాటిపల్లి, గౌరవెల్లిలో కొత్త సాయిరెడ్డి దొడ్లల్లో తలదాచుకున్నారు. ప్రభాకర్రావు వెంట బండి మల్లారెడ్డి, బండి వెంకన్న ఉండేవారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు వచ్చినప్పుడు చిర్లవంచ క్యాంప్లో ప్రభాకర్రావు లాంటి వారు శిక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతంలో పెద్ద భూస్వామి అయిన రంగారెడ్డి ఇంటికి వచ్చి కాగితాలు, దస్ర్తాలు కాలబెట్టినారు. ఒకసారి మహ్మదాపూర్ వచ్చాం. ఆ కాలంలో దళం వచ్చిందంటే ఎవరో ఒకరు బువ్వ పెట్టేవారు.
మేం భోజనం చేస్తున్నప్పుడు చెట్టుమీద కాపలా కాస్తున్న దళ సెంట్రీ ఇన్ఫార్మర్గా మారి నిజాం సైన్యానికి సమాచారమిచ్చాడు. మహ్మదాపూర్.. హుజూరాబాద్కు దగ్గరగా ఉంటుంది. నిజాం సైన్యం, రజాకార్లు దగ్గరికి వచ్చేదాక చెప్పనే లేదు. దగ్గరికి వచ్చినాక చెప్పడంతో అంతా ఉరికాం. తలదాచుకోవడానికి ఏదైతే గుట్ట ఎక్కినరో అక్కడే నిజాం సైన్యం కాల్పులు జరిపింది. అందులో ప్రభాకర్రావుకు తీవ్రగాయాలయ్యాయి. చనిపోతానని అర్థం కావడంతో తన గన్ను నిజాం సైన్యానికి దక్కకుండా బండకేసి కొట్టి పాడు చేశాడు. ఆ కాల్పుల్లో ప్రభాకర్రావుతో పాటు మరో ఇద్దరు అమరులైనారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే రజాకార్ల బలగాలు గౌరవెల్లికి వచ్చాయి. నేను తృటిలో ప్రాణాలతో బయటపడి, రెండు రోజులపాటు ఓ వ్యవసాయ బావిలో తలదాచుకున్నా. బైరాన్పల్లి దాడి, మహ్మదాపూర్ గుట్టల్లో ప్రభాకర్రావు ఎన్కౌంటర్ నన్ను కలిచివేశాయి. నాతో పాటు మా ఊరిలో వేముల నర్సింహులు, చీకట్ల ముత్తయ్య, జంగపల్లి సాయిలు, జంగ భూమయ్య, పిట్టల మార్కండేయులు పోరాటంలో క్రియాశీలకంగా పనిచేశారు. వీరంతా కాలం చేశారు. నేనొక్కడినే మిగిలిన.
నాటి హైదరాబాద్ సంస్థానంలో గ్రామరాజ్యాల ఏర్పాటు గురించి చెప్పండి
భూమికోసం, భుక్తి కోసం, నిజాం నవాబు గద్దెదించటం కోసం, జాగీరు వ్యవస్థ, పటేల్, పట్వారీ, దొర, దేశాయి, దేశ్ముఖ్, జాగీర్దార్లు, మక్తిదార్ల రద్దు కోసం ఆనాడు కమ్యూనిస్టులు పోరాడారు. అప్పడు అంచెంచెల ప్రభుత్వం ఉండేది. దొర గ్రామానికి అధిపతిగా ఉండేవాడు. దేశాయ్ ఓ 4 గ్రామాలకు.. ఇట్లా ఉండేది. వీరంతా నిజాం పెట్టుకొన్న వాళ్లు. వీరు గ్రామాల్లో వసూలు చేసి ఎంతోకొంత నిజాంకు అప్పజెప్పేవారు. మిగతాది అంతా వీరే దోచుకు తినేవారు. అటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు కరీంనగర్, నల్లగొండ, వరంగల్లు, ఆదిలాబాద్ జిల్లాల్లో, మెదక్ జిల్లాలో గురువారెడ్డి నాయకత్వంలో సాయుధ పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే తెలంగాణ సమైక్యతాదినం.
ఈ జిల్లాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడినాయి. అనేక లక్షల ఎకరాల భూములు, వేల పశువులను పేదలకు పంచారు. దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణలో కమ్యూనిస్టులు బలపడితే దేశం నలుమూలలా కమ్యూనిస్టు ప్రాబల్యం పెరుగుతదని ఊహించి వల్లభాయ్ పటేల్ నిజాం నవాబును లొంగిపొమ్మన్నాడు. గవర్నర్ గిరీ ఇస్తామన్నడు. నిజాం ఒప్పకోకపోయే సరికి రాజ్ప్రముఖ్ను చేస్తామని, రాజభరణాలు ఇస్తాం లొంగిపోండి అని బేరసారాలు చేశారు. అప్పటికే గ్రామ రాజ్యాలు ఏర్పడటం, కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుండటంతో చేసేది ఏం లేక ఇక వీటన్నింటికీ ఒప్పుకొని లాంఛనంగా లొంగిపోయారు. కొందరు మత ఛాందసవాదులు ప్రతిఘటన చేశారు తప్ప మరొకటి లేదు..
రజకార్లను ఎలా ఎదుర్కొన్నారు?
బాంచన్ అని కాళ్లు పట్టిన చేతులే బందూకు పట్టాయి. అందినకాడికి అందినయి పట్టుకొన్నరు. తుపాకులు, గుత్పలు, ఒడిసేలు, కారంపొడి.. చివరకు చీపుర్లు కూడా పట్టుకొన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడ గట్టిగా నిలబడటంతో నిజాం లొంగిపోయాడు. రజాకార్లు ఊళ్లకు వచ్చేది. బైరాన్పల్లి, బెక్కంటి, కూటిగంటి గ్రామాల్లో 150 మంది వరకు చనిపోయారు. కూటిగల్లో ఓ ఫకీరు ఉండేవాడు. నిజాం పోలీసులు, రజాకార్లు అంతా మీదపడి.. అందరినీ సంపి.. గూడు కట్టిపోయారు. మేము శవాలను మీద వేసుకొని పడుకొన్నం. ఆ శవాల్లో ఫకీరు ఉన్నడని నమ్మి రజాకార్లు వెళ్లిపోయారు. ఆ ఫకీరు మొన్నటిదాకా బతికే ఉన్నాడు. అప్పుడు భూస్వాముల భూములు చిన్న రైతులు కష్టంచేసి దున్నేవారు. జనం చాకిరీ చేసేవారు. ఈ భూస్వాములు అందరికీ శత్రువులే కదా. అప్పడు మూకుమ్మడిగా దళాలు ఏర్పడి.. ఊర్లకు ఎవరన్న వస్తే ఒడిశేలు పెట్టి కొట్టేవాళ్లు. గ్రామాల్లోనే ఒక మంచె వేసి దానిపై నగారా పెట్టి చెప్పేటోళ్లు.
బీజేపీ ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు?
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్ ఆఫీసుల నుంచి ఆరేడు సార్లు ఫోన్ చేసిండ్రు. ఓ ఉత్తరం పంపారు. పాస్లు కూడా పంపించారు. ‘విమోచన దినోత్సవంలో పాల్గొనాలి. మీరు హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్కు రండి’ అని పిలిచిండ్రు. కానీ, నేను పోలే. ‘నేను రాను. మీది మత పార్టీ. మీరు చేసే కార్యక్రమాల్లో నేను ఎట్టా పాల్గొంటా?’ అని వారికి చెప్పా. అప్పటి సాయుధ పోరాటంలో వారి పాత్రలేదు.
ఇప్పుడు ఏదో కార్యక్రమాలు చేస్తే ఎట్లా? రాజకీయ లబ్ధి కోసం గింత దిగజారుడు ఏమిటి? పోరాటంలో కమ్యూనిస్టులు తప్ప ఎవ్వరూ లేరు. ఇదంతా రాజకీయ డ్రామాలు. చివరకు కార్యక్రమానికి కొన్ని గంటల ముందు కూడా కిషన్రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్ వస్తే కూడా తిరస్కరించాను. బీజేపీ మతతత్వంతో వ్యవహరిస్తున్నది. కులాల మధ్య చిచ్చు పెడుతున్నది. ఎవరి దేవుడు వారికి ఇష్టం. ఎవరి నమ్మకం వాళ్లది. రెచ్చగొడుతూ కించపరిచేలా మాట్లాడుతున్నారు.
ఆనాటి బ్రిటిష్ పాలననే నేడు బీజేపీ చేస్తున్నది. విభజించు, పాలించు అనే సిద్ధ్దాంతంతో కొనసాగుతున్నది. అది నాకు నచ్చలేదు. అందుకే సన్మానాన్ని తిరస్కరించా. నాటి సాయుధ పోరాటం నుంచి నా అంతిమశ్వాస వరకు కమ్యూనిస్టుగా ఉండాలని నిర్ణయించుకున్న. ఆ విధంగానే బతుకుతున్న. 1970-1981 వరకు గ్రామ సర్పంచ్గా రెండు పర్యాయాలు సేవలందించాను. కమ్యూనిస్టు పార్టీలో ఉండి పేదలకు భూములు పంపిణీ చేసిన జ్ఞాపకం మరిచిపోలేనిది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు చాలా చక్కగా చేశారు. కమ్యూనిస్టులు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. నాడు పోరాటం చేసిన వారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉన్నది.
బీజేపీ లేదు.. ఆరెస్సెస్ లేదు..
బీజేపీ లేదు. ఆర్ఎస్ఎస్ లేదు. ఏది లేదు. వాళ్ల జాడలేదు. వాళ్ల ఉనికే లేదు. ఇక్కడ తెలంగాణలోనే కాదు భారతదేశంలోనే లేదు. కమ్యూనిస్టులు మాత్రమే ఉండిరి. కాంగ్రెసోళ్లు వాళ్లు ఇద్దరో ముగ్గురో ఉండిరి. రామానంద తీర్ధ, హయగ్రీవాచారి, ఎంఎస్ రాజలింగం, బూర్గుల రామకృష్ణరావు ఉండిరి. కాంగ్రెస్ వాళ్ల పాత్ర కొంత ఉన్నది. కాదనడానికి వీలులేదు.
ప్రధాన పోరాటం కమ్యూనిస్టులదే. అప్పట్లో నాలుగు వేల మందికి పైగా సాయుధ పోరాటంలో అమరులైనారు. అప్పుడు గాంధీజీ కలల గన్న రామరాజ్యం చూసినం కానీ. ఇప్పడు బీజేపీ వాళ్లది హిట్లర్, గాడ్సే పాలన వచ్చే పరిస్థితులు ఉన్నవి. గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహం పెడుతున్నారు. కొద్ది రోజులైతే గాంధీ విగ్రహాలు పడగొడుతారు. బీజేపీ బలపడితే ఇదే జరగుతుంది. ఇప్పటికే ఎక్కడనో పెట్టారంట. అప్పుడు కమ్యూనిస్టులు కుల, మత రహితంగా అనేక పోరాటాలు చేసిండ్రు.. అప్పుడు పొయ్యి పన్ను, జుట్టు పన్ను ఇలా ప్రత్యక్ష పన్నులు వేసారు. ఇప్పుడు బట్టలు, సబ్బులు, జీఎస్టీ, ఇవన్నీ ప్రజల మీదనే పడుతున్నాయి.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్ ఆఫీసుల నుంచి ఒక ఆరేడు సార్లు ఫోన్ చేసిండ్రు. ఓ ఉత్తరం, పాస్లు కూడా పంపిండ్రు. ‘మీరు విమోచన దినోత్సవంలో పాల్గొనాలి. మీరు హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్కు రండి’ అని పిలిచిండ్రు. కానీ, నేను పోలే. ‘నేను రాను. మీది మత పార్టీ. మీరు చేసే కార్యక్రమాల్లో నేను ఎట్టా పాల్గొంటా?’ అని వారికి చెప్పిన.
సాయుధ పోరాటంలో బీజేపీ లేదు, ఆరెస్సెస్ లేదు. ఏదీ లేదు. వాళ్ల జాడేలేదు. వాళ్ల ఉనికే లేదు. అప్పుడు గాంధీజీ కలలు గన్న రామరాజ్యం చూసినం కానీ. ఇప్పడు బీజేపీ వాళ్లది హిట్లర్, గాడ్సే పరిపాలన వచ్చే పరిస్థితులు ఉన్నవి. గాంధీజీని చంపిన గాడ్సే విగ్రహం పెడుతున్నారు. కొద్ది రో జులైతే గాంధీ విగ్రహాలు పడగొడుతారు. ఉంచరు. బీజేపీ బలపడితే ఇదే జరగుతుంది. ఇప్పటికే ఎక్కడనో పెట్టారంట.
– గాంబీరపు రామయ్య, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు