నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి మా నాన్న నోముల నర్సింహయ్య ఎంతగానో కష్టపడ్డారు. సీఎం కేసీఆర్ మా నాన్నకు సముచిత స్థానం ఇచ్చారు.
ఇప్పుడు నాకూ జన్మలో మరిచిపోలేని అవకాశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి మా నాన్న నర్సింహయ్య నియోజకవర్గానికి వరద కాల్వ, నిడమనూరుకు కోర్టును సాధించారు.
2018లో సాగర్ ప్రజలు మా నాన్న నర్సింహయ్యను ఆదరించి గెలిపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ఆయన ధ్యేయం. చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేశారు.
నెల్లికల్లు, కుంకుడుచెట్టు తండా ఎత్తిపోతల నిర్మాణం జరుగుతున్నది. నాన్న ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’ అని సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ అన్నారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ముఖ్యనాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు భగత్ ధన్యవాదాలు తెలిపారు.