మళ్లీ ముత్తిరెడ్డే జనగామ అభ్యర్థి
మూడోసారి టీఆర్ఎస్దే విజయం
యాదగిరిరెడ్డి గెలుపు కోసం పనిచేద్దాం
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
జనగామ, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వాటిని నమ్మొద్దని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కోరారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. జనగామలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంశంపై కొద్దిరోజులుగా దుష్ప్రచారం జరుగుతోందని, దీంతో స్థానిక క్యాడర్ ఆందోళనకు గురై పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఆ అంశంపై స్పష్టత ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో తాను మొదటిసారి భారీ మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయని అన్నారు. జనగామలో టీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన పునాది ఉందని.. చురుకైన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థాయి క్యాడర్తో పార్టీ బ్రహ్మండంగా ఉందన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా ఉన్న సమయంలో ఆ విషయాన్ని దగ్గరి నుంచి గమనించానని తెలిపారు. ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న సోదర సమానుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి అండగా ఉంటానన్నారు. కేసీఆర్కు ఆప్తుడైన ముత్తిరెడ్డితో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. కొందరి తప్పుడు ప్రచారంతో తమ అనుబంధం చేడిపోతుందనే ఉద్దేశంతో క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. జనగామ జిల్లా సాధనతో పాటు మెడికల్ కాలేజీ మంజూరు చేయించుకున్న ఘనత ఆయనదే నన్నారు. రానున్న ఎన్నికల్లో ముత్తిరెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ టూరిస్టులు.. బీజేపీ నేతలు
జాతీయ సమావేశాల పేరిట జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా దేశంలోని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, నాయకులు తెలంగాణలోని 33 జిల్లాల్లో ఒక్కో సీఎం పర్యటించాలి. ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వారి రాష్ర్టాల్లో అమలు చేసుకోవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. బీజేపీ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం వెనక దురుద్దేశం ఏమిటో ప్రజలకు తెలుసని, సీఎం కేసీఆర్ పెట్టబోతున్న బీఆర్ఎస్ జాతీయ పార్టీకి భయపడి తెలంగాణపై దృష్టి సారిస్తున్నారని అన్నారు. వారు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా టూరిస్టులే అని..కొత్త జిల్లాల్లో పర్యటించి కలెక్టరేట్లు, రోడ్లు చూసి తరించాలన్నారు. హైదరాబాద్లో ప్రారంభించిన టీహబ్ ప్రపంచ చరిత్రలోనే మైలురాయి కాబోతున్నదని కేటీఆర్ నాయకత్వంలో చేపట్టి భారీ ప్రభుత్వ ప్రాజెక్టుగా తెలంగాణ ఖ్యాతి అంతర్జాతీయంగా వెలుగొందుతుందన్నారు. అగ్నిపథ్ అల్లర్లలో చనిపోయిన మృతుడి కుటుంబాన్ని పరామర్శించని కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేసి అవాస్తవాలను ప్రచారం చేయడం దారుణమన్నారు.
కేవలం ఓటు రాజకీయం చేస్తున్న ఆ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని, రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటుందని పోచంపల్లి ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట దివ్యాంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, మున్సిపల్, మార్కెట్ చైర్పర్సన్లు పోకల జమున, బాల్దె విజయ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల సురేశ్రెడ్డి, సీనియర్ నాయకులు బాల్దె సిద్ధిలింగం, మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బూరెడ్డి ప్రమోద్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మల్లవరం అరవింద్రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మసియొద్దీన్, మార్కెట్ డైరెక్టర్ మాశెట్టి వెంకన్న, నాయకులు లెనిన్, దేవునూరి సతీశ్ ఉన్నారు.