ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రైతులు ఎటు వైపు మొగ్గుతారు? బ్రాహ్మణ ఓటు ఎవరికి పడుతుంది? జాట్లు ఏ పార్టీకి మద్దతిస్తారు?.. అటు రాజకీయ పార్టీల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఈ అంశాలపైనే చర్చ జరుగుతున్నది. యూపీలో ఉన్న ముస్లింలు ఏ పార్టీకి ఓటేస్తారన్న దానిపై అటు రాజకీయ పార్టీల నేతలు మాట్లాడటం లేదు. ఇటు ప్రజల్లోనూ చర్చ జరగడం లేదు. ముస్లింల మద్దతు మాకే ఉందని ఏ పార్టీ ప్రకటించుకోవడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం ఓట్లపై యూపీలో గుంభన వాతావరణం నెలకొని ఉన్నది. నిజానికి ముస్లిం ఓటర్లు కూడా తాము ఎవరికి మద్దతిస్తామన్న విషయంలో తర్జనభర్జన పడుతున్నారో.. లేక స్పష్టత ఇవ్వకూడదని అనుకొంటున్నారో.. తెలియడంలేదు.
ఉత్తరప్రదేశ్లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు 143 సీట్లలో గెలుపోటములను ప్రభావితం చేయగలరు. 36 స్థానాల్లో అభ్యర్థులను వీరు ఏకపక్షంగా గెలిపించగలరు. 70 సీట్లలో ముస్లింల జనాభా 20-30 శాతం మధ్యలో ఉంది. 43 సీట్లలో 30 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. అంటే రాష్ట్రంలో మూడో వంతు స్థానాల్లో ముస్లింల ఓట్లు చాలా కీలకం. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 143 స్థానాల్లో 57 సీట్లు గెలుచుకొన్నది. 2017లో బీజేపీ ఇక్కడ 37 సీట్లు గెలుచుకొన్నది. సమాజ్వాదీ పార్టీ 17 స్థానాలను సాధించింది. ముజఫర్ నగర్ అల్లర్లను చూపి బీజేపీ ఇక్కడ హిందూ ఓట్లను సంఘటితం చేసి ఇన్ని స్థానాలను రాబట్టుకొన్నది.
మత ముద్ర వేస్తారనే
2017 నాటి బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముస్లింలు ఇంకా మర్చిపోలేదు. ఓట్లను యోగి మతపరంగా విభజించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుతం అలాంటి ప్రచారానికి అవకాశం ఇవ్వడం లేదు. తాము ఎవరికి మద్దతు ప్రకటించినా బీజేపీ ప్రభుత్వం ఆయా పార్టీలపై మతపరమైన ముద్ర వేసి ఓట్లను చీలుస్తుందని వారికి తెలుసునని, అందుకే మౌనంగా ఉంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. యోగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీలో ముస్లింలకు వ్యతిరేకంగా విధాన నిర్ణయాలు తీసుకొన్నారు. దేశంలో 80 శాతం ఉన్నవారికి 20 శాతం ఉన్నవారికి మధ్యనే పోటీ అని నినాదం ఇవ్వడం కూడా ముస్లింలను దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈ నేపథ్యంలో ముస్లింలు ఎస్పీ వైపు మొగ్గు చూపవచ్చని విశ్లేషకుల అంచనా. యూపీ విధాన సభలో ముస్లింల ప్రాతినిధ్యం ఎప్పుడూ స్థిరంగా లేదు. 1967లో యూపీ అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం 6.6 శాతంగా ఉన్నది. 1985 నాటికి ఇది 12 శాతానికి పెరిగింది. 1991కి మళ్లీ తగ్గి 5.5 శాతానికి పడిపోయింది. 1991 నుంచి 2012 మధ్యలో 17 శాతానికి పెరిగింది. 2017లో బీజేపీ గెలిచింది. అదే సమయంలో ముస్లింల ప్రాతినిధ్యం మళ్లీ 1991 నాటి స్థాయికి పడిపోయింది.
ముస్లిం ఓట్లపై సైలెంట్గా..
యూపీలోని 100 సీట్లలో పోటీచేస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ పార్టీకీ ముస్లింలు బహిరంగంగా మద్దతు ప్రకటించట్లేదు. యోగీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. అందుకే ముస్లిం ఓట్లపై సైలెంట్గా ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రా యం. ముస్లింల గురించి మాట్లాడితే బీజేపీ మత పరమైన విభజన తీసుకొస్తుందన్న అంచనాలతో మాట్లాడటం లేదని పేర్కొంటున్నారు.