AI ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) టెక్నాలజీ రంగంలో సంచలనం.. మానవుడిని పోలిన రోబో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని అంశాల్లో కృత్రిమ మేధ ఆసక్తికరం.. అద్భుతమైన ఫలితాలిస్తున్నది. అదే స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి టూల్స్తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందితే.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలకు.. సమీప భవిష్యత్లో మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారుతుందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధిని నిలిపేయ వలిసిన అవసరం ఉందని ట్విట్టర్ అండ్ టెస్లా సీఈవో ఎలన్మస్క్, ఆపిల్ కో-ఫౌండర్ స్టీవ్ వోజ్నియా సహా 1000 మందికిపైగా టెక్ నిపుణులు కోరారు. ఈ మేరకు ఓ లేఖ మీడియాకు విడుదల చేశారు. ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ తరఫున ‘పాజ్ జియాంట్ ఏఐ ఎక్స్పరిమెంట్స్’ అనే టైటిల్ కింద లేఖ విడుదల చేయడం గమనార్హం.
సెర్చింజన్ గూగుల్కు పోటీగా స్టార్టప్ సంస్థ ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన ‘చాట్ జీపీటీ’ చాట్ బోట్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా జీపీటీ-4 పేరుతో మరింత అడ్వాన్స్డ్ చాట్ జీపీటీ వ్యవస్థను పరిచయం చేసింది. చాట్ జీపీటీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న ప్రముఖులతోపాటు ఓపెన్ ఏఐ ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా నిరసన గళం వినిపిస్తున్నారు. తొలినాళ్లలో ఓపెన్ ఏఐకి నిధులు సమకూర్చిన వారిలో ఎలన్మస్క్ ఒకరు. ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ సంస్థకు మస్క్ నిధులు సమకూరుస్తూ ఉండటం ఆసక్తికర పరిణామం. అంతే కాదు.. విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాలోనూ తమ ఎలక్ట్రిక్ కార్ల కోసం స్పెషల్ ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేస్తుండటం గమనించ దగ్గ పరిణామం.
మానవ మేధస్సుతో పోటీ పడేలా జీపీటీ-4 వంటి ఏఐ ఆధారిత వ్యవస్థలు అభివృద్ధి చేయడం వల్ల సమాజానికి, మానవాళి ఉనికికి తీవ్ర ముప్పు తలపెట్టడమే అవుతుందని ఆ లేఖలో టెక్ దిగ్గజాలు పేర్కొన్నారు. ఏదైనా ప్రతికూల ప్రభావం ముంచుకొచ్చినప్పుడు దాన్ని నియంత్రించగలమన్న నమ్మకం కుదిరిన తర్వాతే శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని హితవు చెప్పారు. జీపీటీ-4 వ్యవస్థ కంటే అత్యాధునిక, శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత కంపెనీలు ఆ పని చేయకుంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.