ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు
జూన్ 2న ప్రారంభోత్సవం
చకచకా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ములుగు, మే 20 (నమస్తే తెలంగాణ) : ములుగులో జిల్లా కోర్టుతో పాటు ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును జూన్ 2న ప్రారంభించేందుకు న్యాయశాఖ అధికారులు అద్దె భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు, ఏటూరునాగారంలో అధికారులు పర్యటించి కోర్టుల ఏర్పాటుకు అనువైన భవనాలను ఎంపిక చేశారు. ములుగులో ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న జూనియర్ సివిల్ కోర్టు పైఅంతస్తులో జిల్లా కోర్టును ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరం చేశారు. న్యాయమూర్తి చాంబర్లతో పాటు కోర్టు హాల్ను నిర్మించారు. ఏటూరునాగారంలో ఐటీడీఏ కార్యాలయంలోని ఓ విభాగంలో పలు గదులను ఎంపిక చేసి మొబైల్ కోర్టును ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా కోర్టులో అన్ని మండలాల్లోని కేసులను పరిష్కరించనున్నారు.
గతంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన ములుగు గణపురం మండలానికి సంబంధించిన కేసులు పరిష్కరించబడేవి. ప్రస్తుతం ఆ కేసులను భూపాలపల్లి కోర్టుకు అధికారులు బదిలీ చేయనున్నారు. అలాగే ఏజెన్సీ మండలాలైన వాజేడు, వెంకటాపురం(నూగూరు)పరిధిలోని కేసులు భద్రాచలం జూనియర్ సివిల్ కోర్టులో పరిష్కరించబడేవి. ప్రస్తుతం ఆ రెండు మండలాల కేసులను సైతం ములుగు కోర్టుకు బదిలీ చేయనున్నారు. ములుగు కోర్టులో జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జి, సీనియర్ సివిల్ కోర్టులను నిర్మించనున్నారు. రూ.30 లక్షల పైబడి ఆర్థిక పరమైన కేసులు, లైంగిక, ఫోక్సో, హత్య, మత్తు పదార్థాల వంటి కేసులు ములుగు జిల్లా కోర్టులో ఇక నుంచి నిర్వహించనున్నారు. ఏటూరునాగారం మొబైల్ కోర్టులో ఏడేళ్లలోపు లోపు శిక్షలు పడే కేసులతో పాటు రూ.30 లక్షల లోపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసుల వాదనలు నిర్వహిస్తారు.