ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారినే లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు లేదా ప్రయాణానికి 15 రోజులు ముందు రెండో డోసు టీకా తీసుకున్న వారినే లోకల్ ట్రైన్లో ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు. దీని కోసం సంబంధిత రైలు పాస్ జారీ చేసేందుకు ఒక యాప్ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. లోకల్ రైళ్లలో ప్రయాణించే వ్యక్తులు తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్లో పొందుపర్చాల్సి ఉంటుందని అన్నారు. మొబైల్ ఫోన్లు లేని వారు స్థానిక కార్యాలయంలో పాస్ కోసం దరఖాస్తు చేయవచ్చన్నారు. ఈ యాప్ వివరాలు సోమవారం వెల్లడిస్తామన్నారు.