Bade Nagajyothi | ‘విప్లవాల యుగం మనది.. విప్లవిస్తే జయం మనది’ అని నినదించిన ములుగు గడ్డ ఇప్పుడు బీఆర్ఎస్ రాగాన్ని ఆలపిస్తున్నది. సమ్మక్క-సారలమ్మల తావున పుట్టిన బడే నాగజ్యోతిని గులాబీ దళపతి కేసీఆర్ ములుగు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. సీఎం కల్యాణలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన తావు అంతా ప్రగతిశోభ సంతరించాలని తపించి.. మదించి ఆదివాసీ కోయ బిడ్డకు అపూర్వ అవకాశం కల్పించారు.
బడే నాగజ్యోతి.. రాష్ర్టానికి ఆమె పేరు తెలియకపోవచ్చు. ములుగు నియోజకవర్గంలో ఇంటింటికీ తెలిసిన పేరు. మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అమరుడైన ప్రభాకరన్న, ఆయన సతీమణి రాజేశ్వరి కూతురు బడే నాగజ్యోతి. తల్లిదండ్రుల అటవీ జీవితంలో ఆమె పుట్టింది. ఆనాటి ఉద్యమం ఆమెను నాన్నమ్మ దగ్గరకు చేర్చింది. కాల్వపల్లి ఆశ్రమ పాఠశాలలో పాఠశాల విద్యను, ఏటూరునాగారంలోని గిరిజన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. హనుమకొండలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్నది ఆమె ఆశ. డీఎస్సీ కోసం ఎదురుచూసే తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. కాల్వపల్లి గ్రామస్తులు పట్టుబట్టడంతో నాగజ్యోతి ఎన్నికల బరిలో నిలిచారు. అప్పటి టీఆర్ఎస్ మద్దతుతో ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందారు. తర్వాత తాడ్వాయి జడ్పీటీసీగా విజయం సాధించారు. ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ అయ్యారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ గుండెపోటు వల్ల హఠాన్మరణం చెందడంతో బడే నాగజ్యోతి ఆ పదవికి ఎంపికయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ములుగు బరిలో నిలిచారు.
ప్రజలతో మమేకమైన ‘బడే’
సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచే జనం మధ్యలో ఉండే నాగజ్యోతి.. రాజకీయంగా ఎదిగేకొద్దీ ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇటీవల ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న కొండాయి, మేడారం, రెడ్డిగూడెం, కాల్వపల్లి, కొత్తూరు తదితర మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఆమె విస్తృతంగా పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. మరోవైపు తండాలు, గూడేలు పంచాయతీలుగా చేయడంతో ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్య తీరిపోవడంతో అడవిబిడ్డలు బీఆర్ఎస్కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మాట తప్పని ముఖ్యమంత్రి
2018 ఎన్నికల సందర్భంగా ములుగు బహిరంగ సభలో ‘ములుగు జిల్లా కోసం మీరు ఉద్యమిస్తున్నారు. మీ కోరికను తీర్చే బాధ్యత నాది. చందూలాల్ను గెలిపించండి. ములుగు జిల్లా చేసే బాధ్యత నాది’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో చందూలాల్ ఓడిపోయారు. అయినప్పటికీ ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరం లేదని కేసీఆర్ అనుకోలేదు. హామీ ఇచ్చినట్టుగానే ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ములుగు ప్రజల్లో అంతర్మథనం నెలకొన్నది. ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి సీఎంకు కానుకగా ఇవ్వాలనే పట్టుదలతో ములుగు ప్రజలు తీర్మానించుకున్నారనే వార్తలు వస్తున్నాయి.