వేములవాడ టౌన్/ ధర్మపురి/ మల్యాల/ కమాన్ చౌరస్తా, జనవరి 2: ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంతోపాటు అన్ని ఆలయాల్లో సోమవారం భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ధర్మపురిలో లక్ష్మీసమేత యోగ, ఉగ్రనారసింహ, వేంకటేశ్వరుడి మూలవిరాట్టులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠద్వారం ఎదురుగా అందంగా అలంకరించిన పుష్ప వేదిక పైకి తీసుకవచ్చి పూజలు చేశారు. అనంతరం తెల్లవారుజామున 5గంటల సమయంలో వైకుంఠ ద్వారం వద్ద పండితులు మంత్రోచ్ఛరణలతో పూజలు చేసిన అనంతరం కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ వైకుంఠ ద్వారం తెరిచారు. అనంతరం మంత్రి దంపతులతో పాటు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవి, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివార్లను దర్శించుకున్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం ప్రాతఃకాలపూజలు నిర్వహించారు.
అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని, శ్రీ లక్ష్మీసమేత అనంతపద్మనాభ స్వామి వార్లను ఉత్తర ద్వారం ద్వారా లోపలికి తీసుకువచ్చారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దసేవలో ఉత్సవమూర్తులను అంబారీపై కూర్చుండబెట్టి ఆలయం ముందుభాగంలో దాదాపు గంటసేపు భక్తుల దర్శనం కోసం ఉంచగా, భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజన్నను 20 వేల మంది దర్శించుకున్నారని, ఆలయానికి సుమారు 14 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో ఉత్తరద్వారం వద్ద ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఆలయ అర్చకులు వేకువజామున పూజలు నిర్వహించి ఉత్తరద్వారాన్ని తెరిచారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో గోదారంగనాథులకు, మూలవిరాట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారిని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకున్నారు.
కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయం, మంకమ్మతోటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, రాంనగర్ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం, అభయాంజనేయస్వామి, సప్తగిరి కాలనీ కోదండ రామాలయం, విద్యానగర్ వేంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గంటల తరబడి బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో స్వామివారి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారిని జడ్పీచైర్పర్సన్ కనుమల్ల విజయగణపతి దర్శించుకున్నారు.