అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా.. భారత విపణిలోకి అధికారికంగా అడుగు పెట్టింది. కార్ల యజమానులంతా తమ ఇంట్లో గ్యారేజీలో ఈ కారును నిలపడానికే ఆసక్తి చూపుతుంటారు.. త్వరలో భారత విపణిలో ఆవిష్కరణకు టెస్లా ఎంట్రీ లెవల్ మోడల్ 3 సెడాన్ కారు సిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మొదలు ప్రముఖ కార్పొరేట్ సంస్థల సీఈవోలు, అధినేతలు ఈ సంస్థ కారును కొనుగోలు చేస్తే, మరికొందరు బుక్ చేసుకున్నారు.. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..
భారత్లో టెస్లా కారును సొంతం చేసుకున్న వారిలో ఎస్సార్ గ్రూప్ సీఈవో ప్రశాంత్ రుయా మొదటి వ్యక్తిగా ఉన్నారు. 2017లో టెస్లా మోడల్ ఎక్స్ కారు భారత్ మార్కెట్లోకి రాగానే ప్రశాంత్ రుయా దాన్ని కొనుగోలు చేశారు. ముంబైలోని టార్డియో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్నారు.
ప్రపంచంలోకెల్లా వేగంగా దూసుకెళ్లే తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇది. దిగుమతి చేసుకున్న కార్లపై సాధారణంగా రూ.20 లక్షల దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దాని ధర రూ. కోటి పై మాటే. కానీ ఎలక్ట్రిక్ కారు కావడంతో పన్నులు, సెస్ల నుంచి మినహాయింపు లభించింది. ఈ కారు 4.8 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది.
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా టెస్లా కారును బుక్ చేసుకున్నారు. 2016లో టెస్లా మోడల్ త్రీ సెడాన్ కారును ప్రీ బుకింగ్ చేసుకోవచ్చునని సంస్థ సీఈవో ఎలన్ మస్క్ ఆఫర్ చేశారు. ఆ వెంటనే చూడముచ్చటైన ఈ కారు కోసం 1000 డాలర్లు చెల్లించి బుక్ చేసుకున్నారు విజయ్ శేఖర్ శర్మ. ఈ కారు కోసం వేచి చూస్తున్నట్లు 2017లో ట్వీట్ చేశారు.
ముకేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు.. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్కు అధినేత అయిన ముకేశ్.. ముంబైలోని తన నివాసంలో 168కి పైగా కార్ల కోసం ఏకంగా ఒక అంతస్తునే రిజర్వు చేశారు. రోల్స్ రాయిస్ కుల్లినాన్ నుంచి ఫాంటోమ్ ఈడబ్ల్యూబీ, బ్లెంటీ బెంటాయ్గా వరకు పలు ప్రముఖ సంస్థల కార్లు సొంతం చేసుకున్నారాయన.. తాజాగా టెస్లా మోడల్ ఎస్ కారును రిలయన్స్ ఇండస్ట్రీ పేరిట రిజిస్టర్ చేశారు.
బాలీవుడ్ ప్రముఖ నటుల్లో రితేశ్ దేశ్ముఖ్ ఒకరు.. ఆయన మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్రావు దేశ్ముఖ్ తనయుడు. తన భార్య జెనీలియా డిసౌజాకు బర్త్డే గిఫ్ట్గా టెస్లా మోడల్ ఎక్స్ ఎస్యూవీ కారును కొనిచ్చారంటే రితేశ్కు తన సతీమణిపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుందీ ఎక్స్ మోడల్ ఎస్యూవీ కారు.
ఇంకా పిన్స్టోర్మ్ సీఈవో మహేశ్ మూర్తి, గోక్వీ ఫౌండర్ సీఈవో విశాల్ గొండాల్ కూడా టెస్లా మోడల్ కారు బుక్ చేసుకున్నారు. ఫ్యూషన్ ప్లాట్ఫామ్ వూనిక్ సీఈవో సుజాయత్ అలీ కూడా టెస్లా మోడల్ త్రీ కారును ప్రీ బుక్ చేసుకున్నారు. దాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బు సంపాదించే పనిలో ఉన్నానని, రెండేండ్లలో టెస్లా మోడల్ 3 కారును సొంతం చేసుకుంటానని ధీమాగా చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!