హుజూరాబాద్: బడుగు బలహీన వర్గాల శాశ్వత శత్రువు బీజేపీ అని ఎమ్మార్పీఎస్టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా దళితులను కనీసం మనుషులుగా చూడలేదని, దళితులకు చేయూత నందించేందుకు కేసీఆర్ కంకణం కట్టుకోవడం గొప్పవిషయమని కొనియాడారు. కుల వ్యవస్థను పెంచి పోషిస్తూ దళితులను బానిసలుగా చేసిన బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్కి దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
పట్టణంలోని ఇందిరానగర్కాలనీలో శ్రీనివాస్ ప్రచారం చేసిన అనంతరం మాట్లాడుతూ అనాదిగా దళితులను బానిసలుగా చూశారే తప్ప ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. దళితులను ఓటు బ్యాంక్గా కూరలో కరివేపాకు లెక్క వాడుకుని వదిలేశారని మండిపడ్డారు.
రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ద్వారా దళిత రీసెర్చ్ సాలర్స్ వస్తున్నటువంటి ఫెలోషిప్లను రాకుండా చేసింది మీ పార్టీ కాదా? దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తా అంటే ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం రాసి దాన్ని అడ్డుకుంది మీ పార్టీ కాదా? బీజేపీ రైతు, కార్మిక, దళితులు, ముస్లింల వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఎల్లపుడూ మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకోవడం వారికి వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఈటల రాజేందర్ దళిత బహుజన వర్గాలకు ఏం చేశాడని ఆయనకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కుమార్, జిల్లా అధ్యక్షుడు సారంగం, కార్యదర్శి డీ. లక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.