సిద్దిపేట, నవంబర్ 25: ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట కలెక్టట్లో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరలు ఏటా అందించినట్లు గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 46 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మంది మహిళలు ఉంటే, 1.99 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు. ఒక ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారె పెట్టినట్లు గొప్పగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొంటున్నట్లు విమర్శించారు. ఒక చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్లంత ఓట్లు గుద్దుండ్రి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఎద్దేవా చేశారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు ఇస్తానన్న రూ. 2500 సంగతి ఏమైందని సీఎం రేవంత్ను హరీశ్రావు ప్రశ్నించారు. రెండేండ్ల్ల బకాయిలు రూ. 60వేలు ఇచ్చి, సారె పెట్టాలన్నారు. రెండు చీరెలు ఇస్తామని చెప్పి ఒకటి ఇచ్చిన నీకు మహిళలు ఎందుకు ఓటేయ్యాల అని రేవంత్ను ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు లేనందుకు చీరలు పంపిణీ చేయడం లేదని, వడ్డీలేని రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. మహిళా సంఘాలు రూ.25 వేల కోట్ల రుణాలు తీసుకుంటే,రూ. 5 వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తుందన్నారు.
మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నారు. గతంలో స్త్రీనిధి కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చామని.. ఇప్పుడు స్త్రీనిధి వడ్డీలేని రుణం ఇవ్వడం లేదని, స్త్రీనిధికి కూడా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, దీనిపై అసెంబ్లీలో మీ పక్షాన మాట్లాడుతానని హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇస్తానని గొప్పగా చెప్పిందని, ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో మహిళా సంఘాలకు ఒక ఆర్టీసీ బస్సు అయినా ఇచ్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని చెప్పి రెండేండ్లు గడిచిందని, ఒక మెగావాట్ పవర్ కూడా ఏర్పాటు చేయించలేదన్నారు. కేసీఆర్ పండుగలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే, రేవంత్రెడ్డి ఓట్లప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. రైతుబంధు ఓట్లకు… చీరల పంపిణీ ఓట్లకే.. వడ్డీలేని రుణాలు ఓట్లకే అని, పంట రుణమాఫీ సగం ఇచ్చిండు.. సగం ఎగొట్టిండు, మోసం చేయడం రేవంత్కు వెన్నతో పెట్టిన విద్య అని హరీశ్రావు అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎస్హెచ్జీ మహిళలు పాల్గొన్నారు.