వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపునకు కృషి చేస్తానని ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు. కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి శనివారం ఆయన రూ. కోటి కేటాయించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్ వచ్చిన ఎంపీ సంతోష్కుమార్.. భద్రకాళీ అమ్మవారు, రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యిస్తంభాల గుడిని పరిశీలించారు. అద్భుతమైన కళాకృతులు, శిల్పసంపద కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యానికి గురికావడం.. ఏండ్లు గడుస్తున్నా కల్యాణమండప నిర్మాణం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మన చరిత్ర, సంస్కృతిని మనమే కాపాడుకోవాలని ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న వెయ్యిస్తంభాల గుడి అభివృద్ధికి, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ. కోటిని తన ఎంపీ ల్యాడ్స్ నుంచి అందిస్తున్నానని చెప్పారు. ప్రతీ ఏటా రూ. కోటి కేటాయించి ఆలయ పునర్వైభవానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి భద్రకాళీ అమ్మవారి ఆలయం, వెయ్యి స్తంభాల ఆలయ పరిసరాల్లో “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం గోశాలలో గోవులకు ఆహారం తినిపించారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాలైన హన్మకొండ, వరంగల్ ట్విన్ సిటీస్ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నదన్నారు. వరంగల్ నగరం మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి సాధిస్తుండడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్ అంటే సీఎం కేసీఆర్కు ఎనలేని అభిమానమని వెల్లడించారు.
ఎంపీ సంతోష్కుమార్ వెంట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ సీతారామ్నాయక్, కుడా చైర్మన్ సుందర్రాజుతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.