ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిలే ఉన్నారు. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాల్లో ఈ దారుణ ఘటన జరిగింది. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహద్ తాలూకాలోని ఖారావలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. భర్త కుటుంబీకులు కొట్టడం వల్ల 30 ఏళ్ల మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన పిల్లల వయసు 18 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.