ఉస్మానియా యూనివర్సిటీ: దేశంలో క్రీడల్లో ఆసక్తి ఉన్న యువతీ యువకులకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా పథకం ద్వారా ఎంతో మంది క్రీడాకారులకు కేంద్రప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. దీంతో ఒలింపిక్స్లో మన దేశ క్రీడాకారులు సత్తా చాటారని అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్మించతలపెట్టిన స్పోర్ట్స్క్లస్టర్కు ఆదివారం శంకుస్థాపన చేశారు. కేంద్రప్రభుత్వ ఖేలో ఇండియా పథకం కింద రూ. 13.5 కోట్లు ఓయూకు మంజూరయ్యాయి. ఈ క్లస్టర్లో భాగంగా సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టులు, మహిళలకు ప్రత్యేక స్విమ్మింగ్పూల్లను నిర్మించనున్నారు.
క్యాంపస్ లోని సీ గ్రౌండ్లో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయించిందని చెప్పారు. కేవలం ఉస్మానియా యూనివర్సిటీకే 13.5 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి రోజూ ఏదో ఒక క్రీడ ఆడుతూ ఉండాలని పిలుపునిచ్చారు. నగరంలో అనేక కారణాల వలన క్రీడలకు సంబంధించిన స్థలాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఓయూ అభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత క్రీడలు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని గుర్తు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
జోనల్ విధానం సమస్య ద్వారా ఉద్యోగాల భర్తీ ఆలస్యం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చిన తరువాత పర్యాటక ప్రదేశాలకు కూడా పూర్వవైభవం వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్, ఎడ్యుకేషన్ విభాగం డీన్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ దీప్లా, ప్రొఫెసర్ సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.