చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తున్నది. ఇప్పటికే దీనికోసం రూ.1,050 కోట్ల నిధులనూ సమీకరించింది. పెట్టుబడి సంస్థలైన టెక్సాస్ పసిఫిక్ గ్రూప్ యూఎస్ఏ, టీమ్సెక్ సింగపూర్ల నుంచి ఈ పెట్టుబడులను అందిపుచ్చుకున్నట్టు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గ్రూప్ సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్ తెలిపారు.
అంతర్జాతీయంగా కెన్యా, మొజాంబిక్, టాంజానియా, ఘనా దేశాల్లోనూ విస్తరించబోతున్నట్టు చెప్పారు. ఇప్పటికే 2019లో 270 కోట్ల పెట్టుబడులను టీమ్సెక్ నుంచి పొందామన్నారు. కాగా, ప్రస్తుతం ఆయా రాష్ర్టాల్లో సంస్థకు 105 దవాఖానలున్నాయి. దీంతో రాబోయే 3-4 ఏండ్లలో వీటిని 200లకుపైగా పెంచాలని చూస్తున్నది. దవాఖానలన్నింటినీ కొత్త టెక్నాలజీలతో ఆధునికీకరించేందుకూ నిధులను వాడనున్నది.
ఇక సంస్థలో ప్రస్తుత ఇన్వెస్టర్ ఏడీవీ పార్ట్నర్స్ వాటాల కొనుగోలుకు ఈ నిధులను అగర్వాల్స్ ఉపయోగించనున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.700 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిన కంపెనీ.. గడిచిన ఐదేండ్లలో కొత్తగా 60కిపైగా దవాఖానలనూ తెరిచింది.