న్యూఢిల్లీ : గుజరాత్లోని మోర్బీ వంతెన ప్రమాదంపై దర్యాప్తునకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారించింది.
వంతెన ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు, ఇతర సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గుజరాత్ హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ విచారణ, పరిహారం కోసం పిటిషన్లతో హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. గత నెల 30న గుజరాత్లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటికి చెందిన తీగల వంతెన కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 134 మంది ప్రాణాలు కోల్పోయారు.