వాషింగ్టన్: క్రిప్టోలకు క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టోల వల్ల కలిగే దుష్ ప్రభావాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో జరిగిన సెమీనార్లో మంత్రి మాట్లాడారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఉండే అతి పెద్ద రిస్క్ మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద సంస్థల లావాదేవీలే అని ఆమె అన్నారు. టెక్నాలజీతో నియంత్రణ చేయాలని, కానీ నియంత్రణ కోల్పోతే ఆ దేశానికి సమస్య అవుతుందని మంత్రి అన్నారు. ఐఎంఎఫ్ డైరక్టర్ క్రిస్టలీనా జార్జీవా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి ప్యానెల్ డిస్కషన్లో మంత్రి పాల్గొన్నారు. భారత్లో కోవిడ్ వేళ డిజిటల్ లావాదేవీలపై ఆధారపడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సీతారామన్ చెప్పారు. డిజిటల్ లావాదేవీలను భారతీయులు త్వరగా దత్తత తీసుకున్నట్లు ఆమె తెలిపారు. దానికి సంబంధించిన డేటాను కూడా ఆమె ప్రజెంట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారవేత్తలతో మంత్రి సీతారామన్ చర్చించనున్నారు.