హైదరాబాద్: నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్, శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత ఇవ్వాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదారబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శ్రీరాముడు దశరథ రాజ కుమారుడు కాదని, నిషాద్ కుటుంబంలో జన్మించారని సంజయ్ నిషాద్ అన్నారు. కాగా, డీఎన్ఏ నిపుణుడైన మోహన్ భగవత్ నిషాద్ పార్టీ చీఫ్ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖ నేతలు దీనిపై మాట్లాడాలని ఆయన అన్నారు.
చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చ జరుగాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అన్ని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు ఎంపీల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలని కూడా కేంద్రాన్ని తాము కోరుతామన్నారు. మన సార్వభౌమత్వాన్ని పునరుద్ఘాటించుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.