మండుటెండల్లో చెమటొడ్చే ఉపాధి కూలి ఇకపై ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకోవాలి. కొద్దిసేపు సేద తీరేందుకు టెంట్ ఉండదు.. చెట్టు నీడ చూసుకోవాల్సిందే. అదనపు కూలి అసలే ఇవ్వరు. రైతులకు ఉపయోగపడే పనులు చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్తో వచ్చే కొత్త కష్టాలివి. ఈ నెల 31 నుంచే ఇది అమల్లోకి రానున్నది. ఇన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సాఫ్ట్వేర్తో అందుతున్న ప్రయోజనాలకు ఇక చెక్ పడనున్నది.
హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న రాగాస్ సాఫ్ట్వేర్లో వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అదనపు కూలి చెల్లించే వెసులుబాటు ఉండేది. టెంట్, తాగునీటి ఏర్పాటు, రైతులకు పనికొచ్చే పనులను చేసే అవకాశం ఉండేది. ఇకపై ఈ పనుల చెల్లింపులకు కేంద్రం తీసుకొచ్చిన నరేగాస్ సాఫ్ట్వేర్లో అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఏడాది మొత్తంలో చేసే పనిలో సగం పనిదినాలు మార్చి నుంచి మే వరకే చేస్తారు. ఆ నెలల్లో వ్యవసాయ పనులు ఉండవు. కూలీలంతా ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. కనీస కూలి రాకుంటే వేసవిలో పనికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, దీంతో కూలీలు మళ్లీ వలస బాటపడుతారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కూలీలు వలస పోకుండా ప్రారంభించిన పథకం స్పూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం ఉన్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తగ్గనున్న కూలీల ఆదాయం
ఉపాధిహామీ అమలు ప్రారంభించిన 2006 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్తో కలిసి రూపొందించిన రాగాస్ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో రాష్ట్రంలో ప్రతి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు వేసవిని దృష్టిలో పెట్టుకొని అదనపు కూలి చెల్లిస్తారు. ఫిబ్రవరిలో 20%, మార్చిలో 25%, ఏప్రిల్, మే లో 30 %, జూన్లో 20% అదనంగా కూలి చెల్లిస్తున్నారు. వేసవిలో ఎండలతో భూమి గట్టిపడుతుంది. దీంతో మట్టి పని తక్కువగా చేయగలుగుతారు. కూలి తక్కువ వస్తుంది. కనీస కూలి వచ్చేందుకు ఐదునెలల పాటు అదనపు కూలి చెల్లిస్తున్నారు. కూలీలకు వేసవిలో టెంట్, తాగునీటిని సమకూర్చేందుకు ఇప్పటివరకు చెల్లింపులు చేస్తున్నారు. కేంద్రం సాఫ్ట్వేర్లో ఈ చెల్లింపులకు ఎలాంటి ఆప్షన్ లేదు. కూలి పనులకు డిమాండ్, పని ఎక్కడ చేసేది చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. కొత్త సాఫ్ట్వేర్లో ఎలాంటి ఏర్పాట్లు లేవు. దీని ద్వారా టెక్నికల్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులు ఇబ్బందులు పడనున్నారు. వీటన్నంటినీ స్థానిక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిసింది.
రైతు పనులకు అనుమతి తప్పనిసరి
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అనేకమార్లు కేంద్రాన్ని కోరారు. దానిని అమలు చేయకపోగా రైతులకు మేలు చేసే పనులు చేస్తున్న రాష్ట్రాన్ని కూడా కేంద్రం ఓర్వడంలేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడానికి ఒక వైపు కూలీలకు పని కల్పించడం మరొక వైపు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దేశంలో ఎక్కడా కూడా తెలంగాణ చేసిన స్థాయిలో రైతులకు ఉపయోగపడే పనులు చేసిన దాఖలాలు లేవు. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడే పనులు చేయడానికి అడ్డంకులు ఏర్పడనున్నాయి. స్థానికంగా రైతులకు ఉపయోగపడే పనులు చేయాలంటే కొత్త సాఫ్ట్వేర్తో కేంద్రం అనుమతి తప్పనిసరి కానుంది. వాటి అనుమతి పొందడానికి నెలల పాటు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.
కొత్త సాఫ్ట్వేర్ అమలుకు ఒత్తిడి
ఉపాధి హామీ కొత్త సాఫ్ట్వేర్ను ఈ నెల 31 నుంచి అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న రాగాస్ సాఫ్ట్వేర్ నుంచి నరేగాస్ సాఫ్ట్వేర్కు మారనున్నది. దేశవ్యాప్తంగా తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాల్లో కేంద్రం రూపొందించిన నరేగాస్ సాఫ్ట్వేర్ అమలవుతున్నదని, తెలంగాణలోనే అదే సాఫ్ట్వేర్ను అమలుచేయాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి గత కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రం రూపొందించిన సాఫ్ట్వేర్ సౌలభ్యంగా, అనువుగా ఉన్నప్పటికీ, కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త సాఫ్ట్వేర్ వినియోగంపై రాష్ట్రం నుంచి మండలస్థాయి వరకు శిక్షణ ఇచ్చారు.