హైదరాబాద్, జనవరి 29 : బీజేపీ దేశంలో ఉగ్రవాద కర్మాగారంగా మారిందని పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఆరోపించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారు రైతులను కాల్చుకు తింటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో చీకటి చట్టాలు వద్దన్న పాపానికి 750 మంది రైతులను చంపి ఖబరస్థాన్కు పంపిందని ధ్వజమెత్తారు. పసుపుబోర్డు తీసుకురాకుండా మాట తప్పినందుకే నిజామాబాద్ జిల్లా రైతులు ఎంపీ అర్వింద్ను అడ్డుకొంటున్నారని పేర్కొన్నారు. పసుపుబోర్డు తెచ్చేవరకూ అర్వింద్కు ఈ నిరసనలు తప్పవని హెచ్చరించారు. పరామర్శ పేరుతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండి రాజకీయం చేశాడని విమర్శించారు. చిల్ల రాజకీయాలు చేయటానికి ఆర్మూర్ వెళ్లిన సంజయ్ని ఎవరూ అడ్డుకోలేదని, అయినా, ఇష్టారీతిగా నోరుపారేసుకొన్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నుంచి రౌడీషీటర్లు, కిరాయి మూకలతో ఆర్మూర్ వెళ్లి అరాచకం సృష్టిచాలని చూశారని ఆరోపించారు. సంజయ్ వెంట రైతులు లేరని, దేశ ద్రోహులు, బీజేపీ నాయకులే ఉన్నారని చెప్పారు. సంజయ్కి దమ్ముంటే పసుపు బోర్డు తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో గంజాయి ఉండదని, భవిష్యత్తులో బండి సంజయ్కి రాజకీయ జీవితం కూడా ఉండదని జ్యోస్యం చెప్పారు. రైతులను ఉగ్రవాదులతో పోల్చిన సంజయ్ని తిరగనీయబోమని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ది తెలంగాణను నిలబెట్టే విధానమని.. బీజేపీది చెడగొట్టే విధానమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇజం నడస్తున్నదని, ఇక్కడ బీజేపీ గూండాయిజం సాగదని తేల్చిచెప్పారు.
రాష్ర్టానికో వేషం వేస్తున్న మోదీ
ప్రధాని మోదీ ఒక్కో రాష్ర్టానికి ఒక్కో వేషం వేస్తారని జీవన్రెడ్డి ఆరోపించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ర్టానికి లక్షల కోట్ల ప్యాకేజీలంటూ ప్రధాని ఉపన్యాసాలు ఊదరగొడతారని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా తనను చంపటానికి మన్మోహన్ సింగ్ సుపారీ ఇచ్చారని, పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వేశంలో ప్రచారం చేశారని అన్నారు. పంజాబ్ పర్యటనకు వెళ్లి రైతులు అడ్డుకున్నారంటే పరువుపోతుందని నడివీధిలో సీన్ క్రియేట్చేసి తనను చంపటానికి కుట్ర జరిగిందని చెప్పారని, ఇది బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.