వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం వివక్ష : మంత్రి వేముల
జగిత్యాల, జనవరి 25 : సీఎం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 8 మెడికల్ కాలేజీలు, 4 సూపర్స్పెషాలిటీ దవాఖానలు, 14 నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభు త్వం వైద్య కళాశాలల మంజూరులోనూ వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా 154 కాలేజీలు మంజూరుచేసి తెలంగాణకు మొండిచేయి చూపిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఉత్తరప్రదేశ్లో జిల్లాకో వైద్యకళాశాల ఇచ్చిందని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల నిర్మాణ పనులను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జగిత్యాలతోపాటు, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, మంచిర్యాల, రామగుండంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మెడికల్ కాలేజీ భవనాలకు రూ.200 కోట్లు, దవాఖానకు రూ.300 కోట్లు, నర్సింగ్ కాలేజీకి రూ.40 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి కాలేజీలో ఏటా 150 మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చెస్ట్హాస్పిటల్, గడ్డిఅన్నారం, అల్వాల్లోనూ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మించనున్నదని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం నాటికి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతాయన్నారు.