విద్య, వైద్యరంగాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా నా వంతు కృషిచేస్తా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేస్తా.. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకరంగానికి అనుకూలంగా ఉంది.. ఈ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయవచ్చు.. అలాగే క్రీడలపై యువత ఎంతో ఆసక్తిగా ఉన్నారు.. ఇందుకోసం జిల్లాలో క్రీడా మైదానాలకు స్థలాలు గుర్తించి స్టేడియం నిర్మించేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తా’నని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు చెప్పుకొచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన.. భవిష్యత్లో చేయబోయే పనులు, అభివృద్ధితో పాటు టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వానికి వన్నె తెచ్చేలా పాటుపడుతానంటూ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఇంకా ఏమేం చెప్పారో ఆయన మాటల్లోనే..
మహబూబాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘ఉద్యమకారుడికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. నాపై ఉన్న విశ్వాసంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలికి పంపడం చాలా సంతోషంగా ఉంది. నాటి ఉద్యమస్ఫూర్తి, ఉత్సాహంతో అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి శాయశక్తులా పాటుపడుతా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తా. నాపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిర్వర్తించి.. పార్టీకి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తా.”
నమస్తే : రానున్న కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయనున్నారు?
రవీందర్రావు :ఎమ్మెల్సీగా రానున్న కాలంలో ముందుగా విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత కల్పిస్తా. నాకు వచ్చే నిధులతో పాటు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నాయకత్వం వహించిన అనుభవంతో అనేక కార్యక్రమాలు చేపడుతా. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తా. జిల్లాకు ఇప్పటికే మెడికల్ కళాశాల మంజూరైంది. పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే మానుకోట మెడికల్ హబ్గా మారనుంది.
నమస్తే : పారిశ్రామికరంగంపై ఏమి చేయబోతున్నారు?
రవీందర్రావు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పారిశ్రామిక రంగంలో చాలా వెనుకబడి ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిశ్రమల జోరు పెరిగింది. ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన పరిశ్రమలు ఇప్పుడు వరంగల్ జిల్లాకు బాట పట్టాయి. ఇందులో ఇప్పటికే టెక్స్టైల్ పార్కు, ఐటీరంగాలు వచ్చాయి. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు వచ్చేలా ప్రజాప్రతినిధులతో కలిసి పాటుపడుతా. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషిచేస్తా.
నమస్తే : పార్టీ, ప్రభుత్వపరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు.
రవీందర్రావు :ఉద్యమ సమయంలో నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలిచేలా పనిచేస్తాం. ఇటు ఎమ్మెల్సీగా ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడుతాం. పార్టీకి, ప్రభుత్వానికి వన్నె తెచ్చేలా పనిచేస్తా.
నమస్తే : క్రీడాకారుల కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు?
రవీందర్రావు :ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన క్రీడలు ఇప్పుడు వరంగల్లో నిర్వహిస్తున్నారు. యువత క్రీడలపై మంచి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో స్టేడియాలు, ఇతర క్రీడామైదానాలు నిర్మించేలా కృషి చేస్తా.
నమస్తే : ఉద్యమకారుడికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఎలా ఉంది.
రవీందర్రావు : 2007 నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశాను. నాలాంటి ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో శాసనమండలి సభ్యుడి పదవి కట్టబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కు నేను, నా కుటుంబ సభ్యులం జీవితాంతం రుణపడి ఉంటాం. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో కష్టపడి పనిచేస్తా.
నమస్తే : పర్యాటకరంగంపై మీకున్న విజన్ ఏమిటి?
రవీందర్రావు : హైదరాబాద్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక రంగానికి అనుకూలమైన ప్రాంతం. రామప్ప, లక్నవరం, ఖిలా వంగరల్, వెయ్యి స్తంభాల గుడి, బొగత, భీమునిపాదం, ఏడుబావుల జలపాతం, బయ్యారం పెద్ద చెరువులను పర్యాటకంగా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. పర్యాటకరంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషిచేస్తా. రానున్న రోజుల్లో పెద్ద పెద్ద చెరువులు, పార్కులను తీర్చిదిద్ది ఆహ్లాదకరంగా మార్చేస్తా.