ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు సభకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందని తెలిపారు. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను పాటించడం లేదని.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు.
అణచివేత, నిరంకుశ ధోరణిని బీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో సహించదని శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ల హౌస్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల పట్ల గౌరవానికి విరుద్ధం అని శంభీపూర్ రాజు అన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటి స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపారు. ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే అని స్పష్టం చేశారు.
యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది అని శంభీపూర్ రాజు ప్రశ్నించారు. యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఇటువంటి నిరంకుశ ధోరణిని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని సూచించారు. అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.