మెట్పల్లి : తన మనసుకు అత్యంత దగ్గరైన పండుగ బతుకమ్మ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని మినీస్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆడబిడ్డలతో కలిసి ఆడిపాడారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఆడబిడ్డలందరికీ మన పండుగైన బతుకమ్మను కాపాడుకోవాలనే ఆలోచన ఏర్పడిందన్నారు.
రోజంతా పని చేసిన కష్టాలన్నింటినీ మర్చిపోయి, పుట్టింటికి వెళ్లి అందరితో కలిసి సంతోషంగా ఆడిపాడే పండుగ బతుకమ్మ అని తెలిపారు. చిన్నతనంలో 8 ,9 తరగతి వరకు చదువుకునే రోజుల్లో తమ ఊరికి వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్లు తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్, పదో తరగతి, ఏడెనమిది తరగతి చదువుకునే పిల్లలు సైతం బతుకమ్మ పాటలు నేర్చుకుని మళ్లీ సంప్రదాయంగా, గర్వంగా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చిందని కవిత అన్నారు.
మన చుట్టుపక్కల దొరికే పువ్వులనే దేవుడిగా కొలిచే పండుగ అని చెప్పారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత, కానీ వందల ఏండ్ల నుంచి బతుకమ్మ రూపంలో పర్యావరణం గురించి చెప్పకనే చెప్పారన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా చెరువులు నిండుగా ఉన్నయని, ప్రతి చోట బతుకమ్మ కోసం సర్పంచులు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది మహిళలతో కలిసి కవిత ఉత్సాహంగా ఉయ్యాల పాటలు పాడుతూ.. ఆటలాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దావ వసంత, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.