నిజామాబాద్ : దసరా వేడుకల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. నిజామాబాద్లోని నివాసంలో భర్త అనిల్తో కలిసి ఆయుధ పూజ నిర్వహించి, పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రామాలయంలో జరిగిన శమీపూజలో పాల్గొన్నారు. అనంతరం కంటేశ్వర్ పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన బాణాసంచా విన్యాసాలను ఎమ్మెల్సీ కవిత తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా జిల్లావ్యాప్తంగా బతుకమ్మ, దేవీ నవరాత్రుల ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం సంతోషకరమన్నారు.
దసరా అంటే అందరికీ ప్రత్యేకమైన పండుగ అని, గత రెండేళ్లు కరోనా కారణంగా దసరా వేడుకలను జరుపుకోలేకపోయామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. నిజామాబాద్లో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. నిజామాబాద్ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ బిడ్డల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మేయర్ నీతూ కిరణ్, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం అంకపూర్లో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుటుంబాన్ని, సుభాష్ నగర్లో భాగా రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలకు ఎమ్మెల్సీ కవిత అందుబాటులో ఉన్నారు.